ఖమ్మం వ్యవసాయం, మే 19 : సీఎం కేసీఆర్తోనే వ్యవసాయ మార్కెట్ల మనుగడ సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రూ.10.34 కోట్లతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మార్కెట్లను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం మార్కెట్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆహార రంగం ప్రైవేట్పరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. రైతులు, రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని, అది ఒక కహానీ మాత్రమేనని అన్నారు.
ఆ డిక్లరేషన్ను నిజంగా అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ చెబుతున్న మోసపూరిత మాటలను నమ్మవద్దని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కొద్ది రోజుల్లోనే రోల్మోడల్గా నిలవబోతోందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే మద్దులపల్లి మార్కెట్కు శంకుస్థాపన చేసుకున్నామని గుర్తుచేశారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కార్ వస్తే నల్లచట్టాలను మరోమారు తీసుకొచ్చే ప్రమాదం ఉందన్నారు.
జిల్లాకు తలమానికం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం నగరానికి ఎంత చరిత్ర ఉందో ఈ మార్కెట్కు సైతం అంతే చరిత్ర ఉందన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్ష మల్లేశం, వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, గొడవర్తి శ్రీనివాసరావు, కార్మిక సంఘం నాయకుడు నున్నా మధవరావు, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్రావు, మార్కెటింగ్శాఖ జేడీ మల్లేశం, డీడీ రాజునాయక్, డీఎంవో కే.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.