“తెలంగాణ సర్కార్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్లో రూ.3.75లక్షల కోట్లు వెచ్చించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాము పాలించే ఏ రాష్ట్రంలోనైనా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్లో నిధులు కేటాయించిందా”? అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఖమ్మం నగరంలో ఆయనతోపాటు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పర్యటించారు. తొలుత నగరంలోని పెద్దాసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మశ్రీ వనజీవి రామయ్యను పరామర్శించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సంబంధించి రూ.10.34 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు మంత్రి అజయ్కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నగర శివారులోని ఎస్ఆర్ గార్డెన్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల రైతు బంధు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వానకాలం సాగుపై నిర్వహించిన సన్నాహక సమా వేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ రైతులను ప్రేమించేది తెలంగాణ ప్రభుత్వమే తప్ప పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే పాదచారులు కాదన్నారు. పాదయాత్రల పేరుతో ప్రజల మనోభా వాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ ఆధునిక సాగు విధానాలను అవలంబించడంలో అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లా ముందంజలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
ఖమ్మం, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో రూ.3.75 లక్షల కోట్లు వెచ్చించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని గుర్తుచేశారు. దేశంలో బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలోనూ పెద్ద మొత్తంగా బడ్జెట్లో నిధులు కేటాయించిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. రైతులను ప్రేమించేది తెలంగాణ ప్రభుత్వమే తప్ప.. పక్కరాష్ట్రం నుంచి వచ్చే పాదచారులు కాదని అన్నారు.
పాదయాత్రల పేరుతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘వానకాలం సాగు-2022’పై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతుబంధు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ, మండల వ్యవసాయ అధికారులకు ఖమ్మం నగర శివారు ఎస్ఆర్ గార్డెన్స్లో గురువారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిరంజన్రెడ్డి.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వ్యవసాయ, సహకార సంస్థ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎం.రఘునాథన్రావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు.
వ్యవసాయ రంగానికి తెలంగాణ సర్కార్ మాత్రమే పెద్దపీట వేసిందన్నారు. లాభదాయకమైన పంటలు వేసుకోవాలనే విషయంలో అవగాహన లేకపోవడంతోనే అన్నదాతలు నష్టాలను చవిచూస్తున్నారన్నారు. అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రైతులను చైతన్యం చేసేందుకు అన్ని జిల్లాల్లో వానకాలం సాగుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతుబీమా పథకాన్ని రాజకీయం చేస్తున్న బీజేపీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రైతులదేనని అన్నా రు.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతులు సహజ మరణం చెందితే కనీసం రూ.10 వేలైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించాలన్నారు. ఖమ్మం జిల్లా వ్యవసాయం వి ధానం యావత్ తెలంగాణకు స్ఫూర్తిదాయకమని మం త్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. సత్తుపల్లిలో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రైతు వేదికలను పూర్తి స్థాయి కార్యస్థలాలుగా తయారు చేయాలని సూచించారు.
ఆధునిక పంటలను అవలంబించడంలో ఖమ్మం జిల్లా ఒక మ్యూజియమని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఏఈవోలు కేవలం రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుకు మాత్రమే పరిమితం కావద్దన్నారు. సాగులో రైతులను చైతన్యవంతులను చేయడంలో కీలక భూమిక పోషించాలని సూచించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతుల ప్రేమను చూరగొన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. వానకాలం సీజన్ కంటే ముందే అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి పంటల సాగులో అవలంబించాల్సిన పద్ధతులపై రైతులను చైతన్య వంతులను చేయడం సంతోషదాయకమని అన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతు బాగుండాలనే ఆలోచన చేసిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పామాయిల్ సాగు 10 లక్షల ఎకరాలకు చేరుతుందని అన్నారు. ముందుగా వ్యవసాయ, సహకార సంస్థ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ‘వానకాలం సాగు 2022’ సన్నాహక సమావేశానికి సంబంధించిన సందేశాన్ని చదివి వినిపించారు.
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్, హరిప్రియ, ఎమ్మెల్సీ తాతా మధు, రెండు జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్, ఖమ్మం, భద్రాద్రి జడ్పీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మార్క్ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ, డీసీఎంఎల్ చైర్మన్లు కూరాకుల నాగభూషయ్య, రాయల శేషగిరిరావు, రైతుబంధు సమతి భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కో ఆర్డినేటర్లు అంజిరెడ్డి కృష్ణారెడ్డి, నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం ఇన్చార్జి డీఏవో సరిత, భద్రాద్రి కొత్తగూడెం వ్యవసాయ అధికారి అనన్య పాల్గొన్నారు.