ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 3: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నది. తెలంగాణ రాక ముందు బదిలీల ప్రక్రియ గందరగోళంగా జరిగిందని ఆరోపణలున్నాయి. దీనిపై పలు సంఘాలు ఆందోళనలు కూడా నిర్వహించాయి. అయితే, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా విద్యాశాఖ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నది. ఎలాంటి తప్పులున్నా సవరించేందుకు ప్రత్యేక రిసోర్స్పర్సన్ కేటాయించడంతోపాటు సహాయ ప్రోగ్రామింగ్ అధికారులు పూర్తిస్థాయిలో సవరిస్తూనే ఉన్నారు. దరఖాస్తుల్లో ఉన్న లోపాల కోసం డీఈవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లనూ ఏర్పాటు చేశారు.
దరఖాస్తుల పరిశీలన పూర్తి..
ఉపాధ్యాయులు వారి నియమావళి ప్రకారం దరఖాస్తు చేసుకున్న వాటిని సంబంధిత మండల విద్యాధికారులు పరిశీలించి డీఈవో కార్యాలయంలో అందజేయాలి. అందుకు సంబంధించి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాల కేంద్రంగా అత్యాధునిక కంప్యూటర్లతో ఎంఈవోల ఆధ్వర్యంలో ఎంఐఎస్లు, సీసీవోలు మండలాల వారీగా దరఖాస్తులను శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు పరిశీలించారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు ఖమ్మం డీఈవో సోమశేఖరశర్మ అందుబాటులో ఉన్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి సిబ్బందికి అందుబాటులో ఉంటూ షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. కార్యాలయంలోని సాంకేతిక విభాగానికి సంబంధించిన సిబ్బంది సైతం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఉంటూ బదిలీల ప్రక్రియలో తలమునకలై ఉన్నారు. సవరణలు ఉంటే సరిచేసి దరఖాస్తులను ఆమోదించారు. ఒక్క రూరల్ మండలానికి సంబంధించిన జాబితానే కొంత ఆలస్యంగా పరిశీలన పూర్తి అయ్యింది.
నేడు రివైజ్డ్ జాబితా..
బదిలీలకు సంబంధించి రివైజ్డ్ ఖాళీల జాబితాను జిల్లా విద్యాశాఖాధికారులు ఉన్నాతాధికారులకు అందించారు. సబ్జెక్ట్ల వారీగా ఖాళీలను స్టేట్ అధికారులకు పంపారు. కేటగిరిల వారీగా ఉపాధ్యాయులకు సంబంధించిన పాయింట్లు వంటి వాటితో పాటు దరఖాస్తుల్లో సవరణలను పొందుపరిచారు. ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన తప్పనిసరి బదిలీ కానున్న ఉపాధ్యాయులు 918 కాగా జిల్లాలో క్లియర్ వేకెన్సీస్ 906 ఉన్నాయి. మొత్తం కలిపి 1,824 ఖాళీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నేడు ఖమ్మం జిల్లాకు అబ్జర్వర్ రమణకుమార్..
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు అబ్జర్వర్గా నియమించిన రమణకుమార్ శనివారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. బదిలీల ప్రక్రియకు సంబంధించి అధికారులతో సమావేశం కానున్నారు. షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న తీరును పరిశీలించనున్నారు.