మామిళ్లగూడెం, మార్చి 30: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న ప్రతి పంచాయతీలోనూ పండుగ వాతావరణంలో గ్రామసభ నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామసభల నిర్వహణపై అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
గ్రామసభల నిర్వహణలో అన్ని శాఖల అధికారులూ భాగం కావాలని, మండలస్థాయి ప్రత్యేక అధికారులు ఆయా సభల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజాప్రతినిధులందరూ గ్రామసభల్లో పాల్గొనే విధంగా ఆహ్వాన పత్రికలు అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన సమాచారాన్ని అందించాలని తెలిపారు.
పారదర్శకంగా ఇసుక సరఫరా కోసం ‘మన ఇసుక వాహనం’ మొబైల్ యాప్ రూపకల్పన చేశామని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘మన ఇసుక వాహనం మొబైల్ యాప్’ను అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి ఈ యాప్ అమల్లోకి వస్తుందన్నారు. గతంలో ఫిజికల్ కూపన్ ద్వారా ఇసుక తరలింపు జరిగేదని, దీని వల్ల కొన్ని అవకవతకలు జరిగే ఆస్కారం ఉండేదని అన్నారు.
అందుకని, ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ఈ యాప్ ప్రవేశ పెట్టామన్నారు. దీని ద్వారా ఎవరికి ఇసుక అవసరముంటే వారే ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని అన్నారు. వారికి వచ్చే క్యూఆర్ కోడ్ ద్వారా ఇసుక డెలివరీ అవుతుందన్నారు. జిల్లాలో ఇక నుంచి ఇసుక సరఫరాకు ఫిజికల్ కూపన్లు జారీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీనిపై తహసీల్దార్లకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించారు. డీఆర్వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో దీక్షారైనా, డీపీవో రాంబాబు, మైనింగ్ ఏడీ సాయినాథ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.