పెండింగ్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
ధరణి లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
మాస్కు తప్పనిసరి ఉత్తర్వులు అమలుచేయాలి
వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్
మామిళ్లగూడెం, మార్చి 30: యాసంగి ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్.. జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో జరిగిన వీడి యో కాన్ఫరెన్సులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కరోనా, పల్లె ప్రగతి, హరితహారం, సమీకృత మార్కెట్ల నిర్మాణం, ధరణి అంశాలపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ హమాలీలు, రవాణా తదితర సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. చివరి నాణ్యమైన గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇన్చార్జులు కీలకపాత్ర పోషిస్తారని, రైతులకు కేటాయించిన టోకెన్ ప్రకారం క్రమపద్ధతిలో నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఉపాధి హామీ నిధులను వినియోగిస్తూ గ్రామంలో స్పష్టమైన మార్పు కనిపించే విధంగా మంచి కార్యక్రమాలు అమలు చేశామని, గత ఏడాది రూ.2740 కోట్ల పనులు జరిగితే ఈ ఏడాది రూ.5400 కోట్లు పనులు జరిగాయని అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా పెండింగ్లో ఉన్న గ్రామ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమీకృత మార్కెట్ల కోసం రూ.500 కోట్ల ప్రత్యేక బడ్జెట్ను కేటాయించినట్లు చెప్పారు. ధరణి లావాదేవీలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో కరోనా సోకిన వారికి వైద్యం అందించేందకు ఏర్పాట్లు చేయాలని, వ్యాక్సిన్ ప్రక్రియ మరింత పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఎంహెచ్వో మాలతి, డీఏవో విజయనిర్మల, డీఎస్వో రాజేందర్, డీపీవో ప్రభాకర్రావు, డీఆర్డీవో శిరీష, పీఆర్ ఈఈ చంద్రమౌళి, అధికారులు పాల్గొన్నారు.