రఘునాథపాలెం, మార్చి 29: కొత్త పంచాయతీ అనగానే వసతులన్నీ సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్కు అది సవాలుతో కూడుకున్న పనే. ఎంత చేసినా, ఎన్ని నిధులు ఖర్చు పెట్టినా.. ఏమాత్రం అభివృద్ధి జరిగినట్టు కనిపించదు. కానీ ‘పల్లె ప్రగతి’ ఆ నూతన పంచాయతీ రూపురేఖలనే మార్చేసింది. ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజలకు జవాబుదారీగా నిలవాలనే సంకల్పంతో పని చేసిన ఆ గ్రామ ప్రథమ పౌరురాలు తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చక్కగా ఉపయోగించుకుంది. కొత్త పంచాయతీలో అభివృద్ధిని పరుగులు పెట్టించింది. పంచాయతీలోకి ప్రవేశించగానే పట్టణాన్ని తలపించేలా కనిపించే రఘునాథపాలెం మండలంలోని పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిపై కథనం.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పువ్వాడ ఉదయ్ నగర్ కాలనీ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లె ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను వినియోగించుకొని నూతన పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు.
దీంతో గ్రామం పట్టణానికి దీటుగా రూపుదిద్దుకుంటోంది. గ్రామంలో 3,025 జనాభా ఉంది. సుమారు 966 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 1800 మంది ఓటర్లు ఉన్నారు. ఊరి జనం మొత్తం కూలి పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. గ్రామానికి ఆనుకొని కోల్డ్స్టోరేజీ ఉండటంతో అనేకమంది గ్రామస్తులు అందులోనే దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రామ సర్పంచ్ పల్లె ప్రగతిలో గ్రామంలో పనులు శరవేగంగా పూర్తి చేశారు. వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనం, సెక్రిగేషన్ షెడ్డు నిర్మాణాలు పూర్తయ్యాయి. అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధి చేసిన తాగునీరు ఇంటింటికీ అందుతోంది. డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రకృతి వనంలో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు నాటి లోపల వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. సాయంత్రం సమయంలో హాయిగా సేదదీరేందుకు రచ్చబండను సైతం నిర్మించారు. ఇంటింటికీ ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు వందశాతం నిర్మించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ప్రతి ఇంటి ఎదుటా హరితహారం మొక్కలు నాటారు. వాటి రక్షణకు ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం పథకంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలో మొదటి విడతగా పువ్వాడ ఉదయ్ నగర్లో 216 ఇండ్లు నిర్మించింది. ప్రధాన రోడ్డులో గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా ఇవి దర్శనమిస్తున్నాయి.