ఉమ్మడి జిల్లాలో వామపక్ష,విపక్షాల ధర్నా
రైతు వ్యతిరేక చట్టాలపై నిరసన
కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిపై ఆగ్రహం
ఖమ్మం, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. మోదీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టే రీతిలో కొత్త చట్టాలు రూపొందిస్తున్నదని నాయకులు నిరసన వ్యక్తం చేశారు.. బస్ డిపోలు, బస్టాండ్లు, ప్రధాన రహదారులపై ధర్నా నిర్వహించారు.
రైతుల పాలిట శాపంగా మారిన కేంద్ర వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బంద్ నిర్వహించారు. ఉదయం 4 గంటలకు ఖమ్మం బస్డిపో వద్దకు వామపక్ష పార్టీల నాయకులు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు చేరుకుని ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. నగరంలోని బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేస్తానని చెప్పి వారిని ఇబ్బంది పెట్టే రీతిలో వ్యవసాయ చట్టాలను తీసుకువస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం మొండి వైఖరిని విడనాడే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఖమ్మంతో పాటు కొత్తగూడెం, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, మధిర, మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో ఈ బంద్ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ బస్సులు తిరగలేదు. పెట్రోల్ బంకులు మూసే ఉన్నాయి. పౌర జీవనం పాక్షికంగా స్తంభించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్, భద్రాద్రి ఎస్పీ సునీల్దత్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బంద్లో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, పొన్నం వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర నాయకుడు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, మహిళా నాయకులు పోటు కళావతి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, శిరోమణి, ఝాన్సీ, పద్మ, జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు రామయ్య, టీడీపీ నాయకులు రంజిత్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.