అవసరాల మేరకు వాడితే తగ్గనున్న బిల్లు భారం
ఖమ్మం జిల్లాలో రోజు సగటున 7.589 మిలియన్ యూనిట్ల వాడకం
వేసవిలో పెరిగిన వినియోగం
6,22,446 విద్యుత్ కనెక్షన్లు
మామిళ్లగూడెం, మార్చి 24 : కరెంట్ కష్టాలకు కాలం చెల్లింది.. కారుచీకట్లు తొలగిపోయాయి. ప్రస్తుతం రెప్పపాటులో కూడా కరెంట్ పోని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ను అందిస్తూ వ్యవసాయ, పారిశ్రామిక, ఉపాధిరంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. కరెంటో మహాప్రభో అనే దయనీయ పరిస్థితి నుంచి తేజోమయ సమాజం వైపు అడుగులు వేస్తున్నది. ఇలాంటి విద్యుత్ను ప్రతి ఒక్కరూ బాధ్యతగా, పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉంది. ‘నేటి విద్యుత్ ఆదా.. రేపటి విద్యుత్ మిగులు..’ అనే నినాదంతో ముందుకు సాగితే ఉజ్వల భవితకు బాటలు వేసినవారవుతారు. అంతేకాదు, విద్యుత్ పొదుపుతో బిల్లు భారం తగ్గనున్నది. అందుకే, విద్యుత్ పొదుపు మంత్రం పాటించండి.. ప్రభుత్వానికి బాసటగా నిలవండి..
తెలంగాణ ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ను అందిస్తోంది. దీంతో పారిశ్రామిక, ఉపాధి రంగం మరింత బలపడ్డాయి. ప్రధానంగా వ్యవసాయానికి కరెంటు కోతల మాటే లేకుండా పోయింది. దీంతో సాగు విస్తీర్ణమూ గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధికి విద్యుత్ రంగం ఎంతో కీలకంగా మారింది. ఇలాంటి విద్యుత్ను ప్రతి ఒక్కరూ బాధ్యతగా, పొదుపుగా వినియోగించాల్సిన తరుణం ఏర్పడింది. ప్రభుత్వానికి బాసటగా ఉన్నట్లుగా కూడా అవుతుంది. ‘నేటి విద్యుత్ ఆదా.. రేపటి విద్యుత్ మిగులు..’ అనే నినాదాన్ని పాటించాల్సి ఉంటుంది.
జిల్లాలో విద్యుత్ వినియోగం ఇలా…
ఖమ్మం జిల్లాలో ప్రతిరోజూ 7.589 మినియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నారు. 2020తో పోల్చుకుంటే ఈ ఏడాది విద్యుత్ వాడకం పెరిగిందని ఎన్పీడీసీఎల్ అధికారులు పేర్కొంటున్నారు. వేసవి రావడంతో ప్రజలు ఏసీలు, కూలర్లు, ప్రిడ్జ్ల వాడకాన్ని గణనీయంగా పెంచారు. దీంతో విద్యుత్ వినియోగం భారీ స్థాయిలో పెరిగింది. 2020 మార్చిలోనే 20 రోజులకు 115.972 మిలియన్ యూనిట్లు వాడకం జరుగగా.. ఈ ఏడాది మార్చిలో 20 రోజులకు 141.343 మిలియన్ యూనిట్ల వాడకం జరిగింది. జిల్లాలో గృహ, వ్యవసాయ, వాణిజ్య అవసరాల కోసం మొత్తం 6,22,446 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
పొదుపుగా వాడితే బిల్లు భారం తగ్గినట్లే..
‘జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా రోజు వారీ డిమాండ్ మేరకు విద్యుత్ను అందిస్తున్నాం. వినియోగదారులు తప్పనిసరిగా విద్యుత్ పొదుపును పాటించాలి. ఫలితంగా బిల్లుల భారం తగ్గుతుంది. ఎక్కువ విద్యుత్ను వినియోగించే ఎలక్ట్రికల్ వస్తువులను వాడకూడదు.’ -కే.రమేశ్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, ఖమ్మం సర్కిల్
ఇవి పాటిద్దాం.. పొదుపు చేద్దాం..
-ఏదైనా కొత్త విద్యుత్ గృహోపకరణాలు కొనుగోలు చేయాలంటే తక్కువ విద్యుత్తో (5 స్టార్ రేటింగ్) ఎక్కువ పనితనం చూపే వాటికి ప్రాధాన్యమివ్వాలి.
-సాధారణ చ్లలదనం కోసం 24 డిగ్రీల వద్ద ఏసీని సెట్ చేసుకోవాలి.
-ఫిలమెంట్ బల్బులకు బదులు తక్కువ విద్యుత్తుతో అధిక వెలుగునిచ్చే ఎల్ఈడీ బల్బులు వాడడం వల్ల 65 శాతం వరకు విద్యుత్ను ఆదా చేయవచ్చు. పగలు వీలైనంత వరకు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. సహజమైన వెలుతురును, గాలిని వినియోగించుకోవాలి. బల్బులు, ట్యూబ్లైటును నెలకొకసారి శుభ్రం చేయాలి.
-ఫ్రిడ్జ్ డోర్లను వీలైనంత తక్కువసార్లు తెరవాలి. ఫ్రిడ్జ్లను వేడి ప్రదేశాలకు దూరంగా ఉంచాలి. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్లనే వాడాలి.
-వాషింగ్ మిషన్ల ద్వారా వీలైనన్ని ఎక్కువ బట్టలు ఒకేసారి ఉతకాలి. బట్టలను ముందుగా నానబెట్టి వాషింగ్ మిషన్లో వేస్తే కరెంట్ ఆదా అవుతుంది. తక్కువ సమయాన్ని (టైమర్) సెట్ చేసుకొని సరైన పాళ్లలో నీళ్లు, సర్ఫ్, లిక్విడ్ వాడాలి.
-వినియోగంలో లేనప్పుడు టీవీ, కంప్యూటర్ మెయిన్ స్విచ్లు ఆఫ్ చేయాలి. కరెంట్ పోయిన వెంటనే స్విచ్లు ఆఫ్ చేయాలి. అవసరం లేనప్పుడు దోమల మిషన్లు, సెల్ చార్జర్లను ఫ్లగ్ నుంచి తీసివేయాలి.
-మోటార్, మిక్సీ, గ్రైండర్ వంటివి పీక్ ఆవర్స్ (ఎక్కువ వినియోగం జరిగే ఉదయం, సాయంత్రం వేళల్లో వినియోగించవద్దు. ఆ సమయంలో వినియోగిస్తే ఆయా పరికరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగక పూర్తి సామర్థ్యంతో పనిచేయవు. దీంతో అదనంగా విద్యుత్ వ్యయమవుతుంది. ఉదాహరణకు.. ఎక్కువ విద్యుత్ వాడకం జరిగే సాయంత్రం సమయంలో మోటారు వేస్తే 15 నిమిషాలకు నిండాల్సిన ట్యాంకు 20 నిమిషాలకు నిండుతుంది.
-మైక్రో ఓవెన్ను మాటిమాటికి తెరవడం వల్ల ఒక్కసారికి 250 డిగ్రీల వేడి వృథా అవుతుంది. ఎలక్ట్రిక్ స్టవ్లపై ప్రెషర్ కుక్కర్ వాడకం ద్వారా విద్యుత్ మరింత ఆదా అవుతుంది. కుక్కర్ గ్యాస్కెట్ లీడ్స్ సరిగ్గా ఉండేలా చేసుకోవాలి. వార్మ్ స్విచ్ ఉన్న రైస్ కుక్కర్ వాడకం వల్ల 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
-ఎలక్ట్రికల్ వాటర్ హీటర్, గీజర్లకు బదులు సోలార్ హీటర్లు వాడుకోవాలి.
-రైతులు డీఎస్ఎం పద్ధతులను పాటించి నాణ్యమైన విద్యుత్ సరఫరా పొందవచ్చు. రాపిడి లేని ఫుట్ వాల్వ్లను వాడాలి. ఐఎస్ఐ మార్కు గల మోనో బ్లాక్ పంపు సెట్లను, సబ్ మెర్సిబుల్ పంపు సెట్లను వినియోగించాలి. తగిన రేటింగ్ ఉన్న కెపాసిటర్లు బిగించుకోవాలి.