గ్రామీణ ప్రాంతాల్లోనూ పటిష్టంగా అమలు చేయాలి
ఇబ్బందులు తలెత్తకుండా కొవిడ్ బాధితులకు సేవలు
రెండో విడత ఇంటింటి సర్వేను త్వరితగతిన పూర్తి చేయండి
పది రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్
ఖమ్మం, మే 21: జిల్లాల్లో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో కొవిడ్ 19 పాజిటివ్ కేసులు, ఆక్సీజన్ బెడ్ల లభ్యత, ఆసుపత్రుల్లో పరిశుభ్రత, మెరుగైన వైద్య చికిత్స, ఇంటింటి సర్వే ప్రక్రియ, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం ఆయా జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి పోలీసు అధికారులతో వరంగల్ కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి సమీక్షించి పలు ఆదేశాలు చేశారు. రాష్ర్టానికి ఆర్థికంగా వేల కోట్లలో నష్టం సంభవిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, కొవిడ్ వ్యాప్తిని తగ్గించేందుకు రాష్ట్రంలో పది రోజులుగా లాక్డౌన్ను అమలు చేస్తున్నామన్నారు. దీన్ని ఈ నెల 30 వరకు పొడిగించినట్లు చెప్పారు. నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ వైద్య సేవలకు సంబంధించిన ఆక్సీజన్ బెడ్లు, ఇంజెక్షన్లు, ఇతర ఔషధాలను సరిపడా నిల్వ ఉంచుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కొవిడ్ బాధితులకు వైద్య సేవల్లో ఇబ్బంది తలెత్తవద్దని సూచించారు. ఇంటింటి సర్వే రెండో విడతను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి రాబోయే పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు..
లాక్డౌన్ను సమర్థంగా అమలు చేస్తున్నాం: ఖమ్మం కలెక్టర్
జిల్లాలో లాక్డౌన్ అమలు పరిస్థితులపై ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సమాధానమిచ్చారు. లాక్డౌన్ అమలు, యాక్టివ్ కేసులు, ఆక్సీజన్ నిల్వలు, ఇంజెక్షన్ల లభ్యత, ఇంటింటి జ్వర సర్వే ప్రక్రియల గురించి వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6.83 లక్షల ఇళ్లలో సర్వే చేశామని, 11,549 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని, 10,272 కిట్లు అందించామని వివరించారు. నగరంలోని ప్రధాన కూడళ్లతోపాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో 12 చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లాక్డౌన్ అమలు కారణంగా జిల్లాలో పది రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. జిల్లాలో 75 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 25 శాతాన్ని తదుపరి పది రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. వీసీలో సీపీ విష్ణు ఎస్ వారియర్, ఏఎస్పీ స్నేహా మెర్రా, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎస్.మధుసూదన్, ఏసీపీ ప్రసన్నకుమార్, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.