జిల్లాలో 1.59 లక్షల మందికి పింఛన్లు
నెలకు రూ.34.69 కోట్లు పంపిణీ
కరోనా కాలంలో అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
పేదలకు సీఎం కేసీఆర్ భరోసా
కూసుమంచి, జూన్ 12: ఆపత్కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు సబ్బండ వర్గాలకు అండగా నిలుస్తున్నాయి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు భరోసా కల్పిస్తున్నాయి. నేత, గీత కార్మికులు, దివ్యాంగులకు ఆసరాగా మారాయి. కరోనా కాలంలోనూ నెలనెలా పింఛన్లు నేరుగా ఖాతాల్లో జమ కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు గీత, చేనేత కార్మికులకు చేయూత ఇస్తున్నది. జిల్లాలో 1,59,319 మందికి వివిధ రకాల పింఛన్లు అందిస్తున్నది. రూ.34,69,62,434ను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నది. జిల్లాలో అత్యధికంగా 63,965 మందికి వితంతు పింఛన్లు అందుతున్నాయి. నెలకు రూ.12,91,48,992 జమ అవుతున్నాయి. పేదలు పింఛన్ డబ్బులతోనే మందులు, నిత్యావసరాలు, ఇతర అవసరాలు తీర్చుకుంటున్నారు. అవసరానికి అక్కరకు రాని డబ్బు, ఆపదలో ఆదుకోని బంధువులు, కష్టంలో కలిసిరాని స్నేహితులున్నా ఒకటే.. లేకపోయినా ఒకటే అంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పింఛన్లు ఖాతాల్లో వేస్తున్నది. ఆపత్కాలంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తుండడంతో సబ్బండ వర్గాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని ముక్త కంఠంతో పేర్కొంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.200 పింఛన్ను రూ.1,000 చేసింది. తర్వాత వాటిని రెట్టింపు చేసి రూ.2,016, దివ్యాంగులకు రూ.3016 ఇస్తున్నది.
కేసీఆర్ సార్ దేవుడు
ఆపద కాలంలో ఆదుకొంటున్న దేవుడు సీఎం కేసీఆర్. పింఛన్ రాగానే మందులతోపాటు నిత్యావసరాలు తెచ్చుకొంటున్నాం. ప్రతినెలా పింఛన్లు వస్తున్నాయి. గతంలో చేతికి ఇచ్చేవారు.. అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రస్తుతం నేరుగా ఖాతాలో డబ్బులు జమ చేయడంతో ఇబ్బందులు తొలగాయి. పింఛన్ మమ్మల్ని బతికిస్తున్నది.
మందా భద్రమ్మ, వృద్ధురాలు
లబ్ధిదారు ఖాతాల్లో జమ
ఆసరా పింఛన్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. సదరం ధ్రువీకరణ పత్రాల ఆధారంగా దివ్యాంగులు, భర్త చనిపోయిన మహిళలకు డెత్ సర్టిఫికెట్ ద్వారా పింఛన్ మంజూరు చేస్తున్నాం. ఖాతాల్లో డబ్బులు పడడంతో అవకాశం ఉన్నప్పుడు వెళ్లి తెచ్చుకునే వెసులుబాటు కలిగింది. ఎంతో మంది పేదలకు ఆసరా పింఛన్లు ఉపయోగపడుతున్నాయి. ప్రతినెల రూ.34 కోట్లు పింఛన్లు అందజేస్తున్నాం.
విద్యాచందన, డీఆర్డీవో పీడీ
పేదలకు వరం
నేను పనులకు పోలేను. ఇంటి వద్దే ఉంటున్నా. నాలాంటి పేదలకు పింఛన్ వరంలా మారింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా వస్తున్నాయి. వాటితోనే మందులు సామాన్లు తెచ్చుకొంటున్నా. సీఎం కేసీఆర్ సార్ సల్లంగా ఉండాలె. దిక్కు లేనివారికి ఆయనే పెద్దదిక్కు.
కంది శేషమ్మ, దివ్యాంగురాలు కూసుమంచి
ఆసరా పింఛన్తో జీవనం
దివ్యాంగులకు కేసీఆర్ ప్రభుత్వం రూ.3,016 అందిస్తున్నది. నాకు కావాల్సిన మందులు, కుటుంబ అవసరాలకు పింఛన్ తోడ్పడుతున్నది. నేను ఎక్కడికి వెళ్లలేను. మంచంలోంచి కలలేను.
ఉపేందర్, దివ్యాంగుడు కూసుమంచి
ఆపత్కాలంలో అండగా..
నా భర్త వదిలి వెళ్లి 18 ఏళ్లు అవుతున్నది. ఒంటరి మహిళ పింఛన్తోనే జీవనం సాగిస్తున్నా. కరోనాతో పనులు లేక ఇంటి వద్దే ఉంటున్నా.. ఆసరా పింఛన్తో జీవనం గడుస్తున్నది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. మాలాంటివారికి పెద్దన్నలా నిలుస్తున్నారు.
కొలిపాక ఎల్లమ్మ, ఒంటరి మహిళ, కూసుమంచి