నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కుల అందజేత
కల్లూరు, ఏప్రిల్ 11: సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో 18 గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. గ్రామాల్లోని 85 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ.85 లక్షల విలువైన చెక్కులను, సీఎంఆర్ఎఫ్ కింద రూ.18 లక్షల విలువైన చెక్కులను స్వయంగా అందజేశారు. నిరుపేద యువతులకు ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరవగా ఎమ్మెల్యే సండ్ర తన సొంత ఖర్చులతో నూతన వస్ర్తాలు తీసుకొని చెక్కులతో కలిపి వాటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో పేద కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను గమనించిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ పథకాలతో వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, సర్పంచ్ లక్కినేని నీరజ రఘు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పసుమర్తి చందర్రావు, మండల సభ్యుడు లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, సొసైటీ చైర్మన్లు పాలెపు రామారావు, వెంకటేశ్వరరెడ్డి, దయాకర్రెడ్డి, కిరణ్కుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వేము రాంబాబుకు పరామర్శ
మండలంలోని పెద్దకోరుకొండి గ్రామానికి చెందిన జర్నలిస్టు వేము రాంబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం పెద్దకోరుకొండిలోని వేము రాంబాబు నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.