అభివృద్ధి బాటలో గిరిజన పల్లె
విద్యుత్ సమస్యలకు పరిష్కారం
పచ్చందాలతో నాలుగు ప్రకృతి వనాలు
ప్రభుత్వ లక్ష్యాలకు చేరువ
మణుగూరు రూరల్, ఏప్రిల్ 5: రాత్రిళ్లు చీకటిమయంగా వీధులు.. పక్కనే గోదావరి పారుతున్నా తాగునీటి కోసం ఇక్కట్లు.. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక మరమ్మతులకు గురయ్యే మోటార్లు.. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేక ప్రబలే వ్యాధులు.. వానకాలంలో రోడ్డు పైనే పారే బురద.. ఇవీ ఉమ్మడి రాష్ట్రంలో మణుగూరు మండలంలోని కూనవరం గ్రామస్తుల సమస్యలు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామస్వరూపమే మారిపోయింది. చిన్నపంచాయతీల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పడిన ఈ పంచాయతీ.. ‘పల్లె ప్రగతి’లో దూసుకుపోతున్నది. ప్రభుత్వ లక్ష్యాలకు చేరువైంది. పాలకవర్గ సభ్యులు, అధికారులు సమష్టిగా పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించారు.
జరిగిన అభివృద్ధి ఇదీ..
గ్రామ జనాభా 1,2730 కాగా ఇక్కడ 4,230 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో రూ.2.50 లక్షల నిధులతో డంపింగ్ షెడ్ అందుబాటులోకి వచ్చింది. పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. రూ.10.లక్షలతో నిర్మించిన వైకుంఠధామంలో అన్ని వసతులు ఉన్నాయి. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా పల్లెలో 2,500 మొక్కలు పెరుగుతున్నాయి. వైఎస్సార్ నగర్లో ఒకటి, రేగులగండిలో ఒకటి, కూనవరంలో మూడు ప్రకృతి వనాలు గ్రామానికి పచ్చందాలు తీసుకువచ్చాయి. ఒక్కో ప్రకృతి వనంలో రెండువేల మొక్కల చొప్పున పెరుగుతున్నాయి. పాలకవర్గ సభ్యులు గ్రామంలోని నర్సరీలో 17 వేల మొక్కలు పెంచుతున్నారు. గ్రామంలో రూ.36 లక్షల నిధులతో ఎన్టీఆర్నగర్, కూనవరం, చంద్రబాబునగర్ ఏరియాల్లో సీసీ రోడ్లు నిర్మించారు.
మిషన్ భగీరథతో ఇంటింటికీ నీరు..
‘మిషన్ భగీరథ’తో గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం దొరికింది. 450 ఇండ్లకు మాత్రమే తొలుత నీటి కనెక్షన్ల అనుమతి రాగా సర్పంచ్ ఏనిక ప్రసాద్ సమస్యను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత గ్రామంలోని 1,230 ఇండ్లకు నీటి కనెక్షన్లు అందాయి. దీంతో తాగునీటి సమస్యకు పరిష్కారం దొరికింది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని 15 పాడుబడిన బావులు, రెండు పాత భవనాలు, మూడు మ్యాన్ హోళ్లను పూడ్చివేశారు. గ్రామంలో నేలవాలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం, త్రీఫేజ్ విద్యుత్ అందిస్తుండడం, మూడు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో విద్యుత్ సమస్యలకు పరిష్కారం దొరికింది. ప్రతి వీధికి 322 వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో రాత్రిళ్లు విద్యుత్ కాంతులు వెదజల్లుతున్నాయి.
సమష్టి సహకారంతోనే అభివృద్ధి..
పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధుల సంపూర్ణ సహకారంతో పంచాయతీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకున్నాం. అధికారులు సహకరిస్తున్నారు. ప్రజాప్రతినిధుల సానుకూల వైఖరితో తాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. శ్మశానవాటిక, డంపింగ్షెడ్, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ పథకాలతో గ్రామస్తులకు మౌలిక వసతులు అందాయి.
-ఏనిక ప్రసాద్, సర్పంచ్ కూనవరం
ఇవి కూడా చదవండి
మూడు రాష్ట్రాలో భూకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రత
మహారాష్ట్రలో కొత్తగా 47,288 కరోనా కేసులు
జగ్జీవన్ రామ్కు ఏపీ సీఎం జగన్ నివాళి