న్యూఢిల్లీ: ఢిల్లీలోని పాలెంలో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగిన ఘటనలో 9 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రామ్ చౌక్ మార్కెట్లో ఉన్న 4 అంతస్తుల భవనంలో ఉదయం 7 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భవనం బేస్మెంట్, గ్రౌండ్ఫ్లోర్లో బట్టల దుకాణంతో పాటు కాస్మెటిక్స్ షోరూం కూడా ఉన్నది. అయితే బిల్డింగ్లోని టాప్ రెండు ఫోర్లలో ఆ ఇంటి యజమానులు ఉంటున్నారు. అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారిని ప్రవేశ్, కమాల్, ఆశు, లాడో, హిమాన్షి, దీపికతో పాటు ముగ్గురు మైనర్ బాలికలు ఉన్నారు. అనిల్, సచిన్తో పాటు మరో రెండు ఏళ్ల అమ్మాయి గాయపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.
పాలంకు చెందిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బిల్డింగ్ ఓనర్ను రాజేంద్ర కశ్యప్గా గుర్తించారు. కుటుంబసభ్యులు బిల్డింగ్లోని రెండో, మూడో ఫ్లోర్లలో నివసిస్తున్నారు. 20 ఫైర్ టెండర్లు, 11 సీఏటీఎస్ అంబులెన్సులు, బీఎస్ఈఎస్ , ఎయిర్ ఫోర్స్ పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందం చేరుకున్నది. స్థానిక పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.