ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 13 : తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేజీబీవీల్లో ఒప్పంద అధ్యాపకులను ఎంపిక చేశామని, వారంతా అంకితభావంతో విధులు నిర్వర్తించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాలోని 12 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఎంపిక చేసిన ఒప్పంద అధ్యాపకులకు ఖమ్మంలోని నూతన కలెక్టరేట్లో ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించి.. నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బాలికల కోసం ప్రభుత్వం కేజీబీవీలను ఏర్పాటు చేసిందన్నారు. ఆయా విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధతో బోధించాలన్నారు. అలాగే నియామక పత్రాలు పొందిన వారంతా వెంటనే విధుల్లో చేరాలని ఆమె కోరారు. డీఈవో సోమశేఖర శర్మ మాట్లాడుతూ జిల్లాలోని 14 కేజీబీవీలకుగాను.. 12 కేజీబీవీలలో సీఆర్టీ, పీజీ సీఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటి భర్తీకి ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించిందన్నారు. మొత్తం 5 సీఆర్టీ పోస్టులు, 42 పీజీ సీఆర్టీ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. వీరిలో ఒక అభ్యర్థిని రెండు పోస్టులకు ఎంపిక కావడంతో ఆమె సీఆర్టీ పోస్టులో జాయిన్ కావడం లేదన్నారు. పోస్టులతోపాటు రోస్టర్ ప్రకారం అభ్యర్థులు అందుబాటులో లేని కారణంగా నాలుగు పోస్టులు భర్తీ చేయడం కుదరలేదని పేర్కొన్నారు. నియామక పత్రాలు పొందిన వారిలో 42 మంది విధుల్లో చేరారని తెలిపారు. కార్యక్రమంలో జీసీడీవో భూలక్ష్మి, సీఎంవో రాజశేఖర్, ఏపీవో ఎన్.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు చావా శ్రీనివాసరావు, ఎస్.శ్రీధర్బాబు, జీఎస్.ప్రసాద్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఆగస్టు 13 : జిల్లాలోని 13 కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 76 పోస్టుల భర్తీకి కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపికైన అభ్యర్థులకు ఆదివారం ఐడీవోసీలో కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్కు మొత్తం 68 మంది హాజరయ్యారు. వారికి కాంట్రాక్టు పద్ధ్దతిలో నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ 1, సీఆర్టీ తెలుగు 2, సీఆర్టీ హిందీ 2, సీఆర్టీ ఆంగ్లం 5, సీఆర్టీ గణితం 2, సీఆర్టీ ఫిజికల్ సైన్స్ 3, సీఆర్టీ బయోలాజికల్ సైన్స్ 1, పీఈటీ 1, పీజీ సీఆర్టీ ఆంగ్లం 1, పీజీ సీఆర్టీ గణితం 5, పీజీ సీఆర్టీ ఫిజిక్స్ 3, పీజీ సీఆర్టీ కెమిస్ట్రీ 5, పీజీ సీఆర్టీ బోటనీ 4, పీజీ సీఆర్టీ జువాలజీ 3, పీజీ సీఆర్టీ సివిక్స్ 4, పీజీ సీఆర్టీ ఎకనామిక్స్ 33, పీజీ సీఆర్టీ కామర్స్ 5, పీజీ సీఆర్టీ నర్సింగ్ 5 అభ్యరులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వారంతా ఈరోజే విధుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏసీజీఈ మాధవరావు, సూపరింటెండెంట్ జ్యోతి, జీసీడీవో అన్నామణి, కో ఆర్డినేటర్లు నాగరాజశేఖర్, సతీష్కుమార్, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు