బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు కేక్లు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ పెద్దఎత్తున పటాకులు కాల్చారు. బీఆర్ఎస్ నాయకులు పలుచోట్ల మొక్కలు నాటారు.
కొత్తగూడెం రైల్వేస్టేషన్లో 50కిలోల కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామన్నారు. పాత పాల్వంచలోని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు నివాసంలో కేక్ కటింగ్ అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్దేనని, ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. -నమస్తే తెలంగాణ నెట్వర్క్