కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 19 : కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిపై మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మొత్తం కౌన్సిల్ సభ్యులు 36 మంది, ఎక్స్అఫీషియో సభ్యుడు ఒకరు మొత్తం 37 మంది ఉండగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 2/3 వంతు అంటే కనీసం 25 మంది కౌన్సిల్ సభ్యులు అవసరంకావడంతో నిర్ణీత సమయానికి ఒక్క కౌన్సిలర్ మాత్రమే సమావేశానికి హాజరయ్యారు.. అవిశ్వాసాన్ని ప్రతిపాదించిన కౌన్సిలర్లు ఎవరూ హాజరుకాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రిసైడింగ్ అధికారి డి.మధు ప్రకటించారు. దీంతో యథావిధిగా మున్సిపల్ చైర్పర్సన్గా కాపు సీతాలక్ష్మి కొనసాగనున్నారు. వివరాల్లోకెళ్తే.. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రిసైడింగ్ అధికారి డి.మధు ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం మున్సిపాలిటీలో చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మాన సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11:30 గంటల వరకు ఒక్క కౌన్సిలర్ కూడా హాజరుకాలేదు. దీంతో మున్సిపల్ చట్టం ప్రకారం కౌన్సిలర్లు హాజరయ్యేందుకు మరో అవకాశాన్ని అధికారులు కల్పించారు. మధ్యాహ్నం 2గంటల వరకు అవకాశం ఇచ్చినప్పటికీ 28వ వార్డు కౌన్సిలర్ మండల ఆమని మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం లేనందున అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రిసైడింగ్ అధికారి విలేకరుల ఎదుట ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ టి.శేషాంజన్స్వామి, తహసీల్దార్ డి.పుల్లయ్య పాల్గొన్నారు.
కొత్తగూడెం పట్టణాభివృద్ధికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి తెలిపారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ఆమె ‘నమస్తే’తో మాట్లాడారు. నిజాయితీ, ధర్మం గెలిచిందని, కొంతమంది ప్రలోభాలకు లొంగి, పదవీ వ్యామోహంతో తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని, కానీ కౌన్సిలర్లు తనవైపు ఉండడం వల్ల అవిశ్వాసం వీగిపోయిందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. – సీతాలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్