మామిళ్లగూడెం, జనవరి 11 : కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, కలెక్టర్ వీపీ గౌతమ్, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావుతో కలిసి జిల్లా వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 55 బృందాలను ఏర్పాటు చేశామని, లోటుపాట్లు లేకుండా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. బృందాలన్నింటికి శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేయాలన్నారు. కంటి పరీక్షలు నాణ్యతతో చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. జిల్లా సీనియర్ వైద్యశాఖ అధికారి నిర్వహణ బాధ్యతలు చేపట్టాలన్నారు.
కంటి వెలుగు శిబిరాన్ని ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి 5రోజులు నిర్వహించాలన్నారు. రిజిస్ట్రేషన్, కంటి స్రీనింగ్ తదుపరి రెండుసార్లు డాటా నమోదు చేయాల్సి ఉంటుందని, నమోదులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏడీఎం, డీడీఎం, ఏఎన్ఎం బృంద సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేసి పూర్తి చేయాలన్నారు. లేటెస్ట్ వర్షన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు. శిబిరం వద్ద క్యూ పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు కార్యక్రమం పూర్తి కాగానే ఇంవెంటరీ మాడ్యూల్లో వివరాలు నమోదు చేయాలని, ఎన్నిరకాల, ఎన్ని కళ్లజోళ్లు ఇచ్చినది, మిగులు, ఇంకా అవసరాలు నమోదు చేయాలని సూచించారు. ఏఆర్ మిషన్లు మంచి స్థితిలో ఉండాలని, అన్ని పరికరాలు ముందస్తుగా చూసుకొని ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
గ్రామాల్లో శిబిరం కేంద్రాల వద్ద టెంట్, తాగునీరు, కుర్చీలు, టేబుళ్లు అన్ని మౌల్కి వసతుల కల్పన చేయాలన్నారు. శిబిరం ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమ విజయవంతానికి ప్రజల సేకరణ ఎంతో ముఖ్యమని ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో ప్రతిరోజు 120 మంది పరీక్షలకు వచ్చేట్లు చూడాలన్నారు. ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేసి, అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేయాలన్నారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ డీఎంవో, డాటా ఎంట్రీ వారు ఎంతో ముఖ్యమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు నాయకత్వంతో ఈ కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తారన్నారు. జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, శిబిరం బృంద, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిషరించాలని తెలిపారు. బఫర్ సిబ్బంది, మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
సమస్యలు వస్తే, అర గంటలో రీప్లేస్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని, పీఆర్, మున్సిపల్ అధికారులు కార్యక్రమంలో పాలుపంచుకోవాలని తెలిపారు. ఇన్వెంటరీని నమోదు చేస్తూ, షెడ్యూల్ ప్రకారం కార్యక్రమ నిర్వహణ చేయాలన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టి కార్యక్రమం విజయవంతం చేస్తామన్నారు. సూక్ష్మ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామన్నారు. జిల్లా, మండల స్థాయిల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సమావేశాలు నిర్వహించి, షెడ్యూల్ ఆందజేసినట్లు వివరించారు. వైద్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని, వ్యక్తిగత శ్రద్ధతో చేపట్టాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి జిల్లా స్థాయిలో, వైద్యాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో నాయకత్వం వహించాలన్నారు. అన్ని ఏర్పాట్లు రెండు రోజుల్లో పూర్తి చేసుకొని, సన్నద్ధంగా ఉండాలన్నారు.
అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని తెలిపారు. కంటి వెలుగు నిర్వహణతో రోజువారీ ప్రజాసేవలకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ఎంసీహెచ్, ఎన్సీడీ, ఇమ్యునైజేషన్ తదితర సేవలు ఆగకూడదని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇన్వెంటరీ స్టాకును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, అవసరాలను ముందస్తుగా తెలిపితే సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏఆర్ మిషన్లలో లోపం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, టెక్నీషియన్లను పంపి సరిచేస్తామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధికగుప్తా, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ బి.మాలతి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డివిజనల్ పంచాయతీ అధికారి పుల్లారావు, ఉప జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ రాంబాబు, వైద్య ఆరోగ్య ప్రాజెక్ట్ అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.