మామిళ్లగూడెం, జనవరి 13: కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. కంటి వెలుగు నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మెడికల్ ఆఫీసర్లు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణకు నోడల్ అధికారులుగా ఉంటారన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన బృందాలను సన్నద్ధంగా ఉంచాలని, అదనంగా బఫర్ బృందాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఖమ్మం నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో 589 పంచాయతీలు, 125 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 714 క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం 55 కంటివెలుగు బృందాలు, మూడు బఫర్ బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. 59,900 కళ్లజోళ్లు ఇప్పటికే జిల్లాకు చేరాయని, 46 ఏఆర్ మిషన్లు అందాయని వివరించారు. గురువారం మండలస్థాయి టాస్ఫోర్స్ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న శిబిరాన్ని మోడల్ శిబిరంగా తీర్చిదిద్ది అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
కేఎంసీ కమిషనర్ సమీక్ష
ఈ నెల 18 నుంచి జరిగే రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం కార్పొరేషన్లో విజయవంతం చేయాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం తన ఛాంబర్లో నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, మెప్మా సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ల సమావేశంలో కమిషనర్ పలు సూచనలు చేశారు.