భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ బడి.. ఆ పిల్లలకు అమ్మఒడిని తలపిస్తున్నది. తల్లిలా లాలిస్తున్నది. చేయి పట్టి అక్షరాలు దిద్దిస్తున్నది. లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్ల పంచాయతీ పరిధిలోని గంగమ్మకాలనీ మినీ అంగన్వాడీ కేంద్రం అద్భుతాలు సృష్టిస్తున్నది. గొత్తికోయలు వలస వచ్చిన ఆ గ్రామంలో పని చేస్తున్న టీచర్ జ్యోతి ప్రత్యేక పట్టుదలతో పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నది. పిల్లల ఎదుగుదల, వారి ఆరోగ్యంపై దృష్టి సారించి గ్రామస్తుల మన్ననలు పొందింది. ఇప్పుడు ఆ కేంద్రంలో 24మంది చిన్నారులున్నారు.
అది గొత్తికోయలు వలస వచ్చిన గ్రామం. మారుమూల పల్లె. అలాంటి గ్రామానికి మినీ అంగన్వాడీ కేంద్రం మంజూరైంది. వలస గ్రామంలో పక్కా భవనం నిర్మించడం లేదా కేంద్రాన్ని నిర్వహించడం అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది అంగన్వాడీ టీచర్. ఆమే జ్యోతి. లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్ల పంచాయతీ పరిధిలోని గంగమ్మకాలనీలో ఉంది.. ఆ కేంద్రం. 2013 ఆగస్టు 18న అంగన్వాడీ టీచర్గా పోస్టింగ్ తీసుకున్న జ్యోతి నిబద్ధతతో పని చేస్తూ గ్రామస్తులకు సేవలందిస్తూ వస్తున్నది. మొదట్లో అంతంతమాత్రంగా కేంద్రానికి పిల్లలు వచ్చేవారు. తల్లిదండ్రులూ తమ పిల్లలను కేంద్రానికి పంపేందుకు ఆసక్తి చూపేవారు కాదు. అయినా.. జ్యోతి పట్టువదలకుండా పిల్లల ఎదుగుదల, వారి ఆరోగ్యంపై దృష్టి సారించి గ్రామస్తుల మన్ననలు పొందింది. ఇప్పుడు కేంద్రానికి 24 మంది చిన్నారులు వస్తున్నారు. అక్షరాలు దిద్దుతున్నారు. కేంద్రంలో పోషకాహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు. అలాగే కేంద్రం నుంచి తొమ్మిది మంది గర్భిణులు, నలుగురు బాలింతలు సేవలు పొందుతున్నారు. కేంద్రానికి వచ్చి తర్వాత బడికి వెళ్లిన పిల్లలు పదిమంది ఉన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంటున్న వారు మరో పదిమంది ఉన్నారు.
దాతల సాయం..
అంగన్టీచర్ జ్యోతి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలను మెచ్చి ఎంతోమంది స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కేంద్రం అభివృద్ధికి సహకరించారు. ఖమ్మం నగరానికి చెందిన దాతలు కొంగర పురుషోత్తమరావు, రామచంద్రరావు 2019లో పక్కా భవన నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా అందించారు. ఆ సొమ్ముతో నూతన అంగన్వాడీ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. అంగన్వాడీ టీచర్ భవనానికి రంగులు వేయించింది. గోడలపై పిల్లలకు ఉపయోగపడే తెలుగు, ఇంగ్లిష్ అక్షరమాలలు గీయించారు. కేంద్రాన్ని చదువుల గుడిగా మలిచింది. దీంతో పిల్లలు ఇష్టంగా కేంద్రానికి వస్తున్నారు. కేంద్రం నిర్వహణ గురించి తెలుసుకున్న సింగరేణి డైరెక్టర్ బలరాం స్వయంగా వచ్చి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రానికి అవసరమైన సామగ్రిని సమకూర్చారు. శ్రీనగర్ ఉప సర్పంచ్ లగడపాటి రమేశ్ ఎన్ఆర్ఐల సహకారంతో కేంద్రానికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. సోషల్ మీడియాలో కేంద్రం గురించి తెలుసుకున్నవారు అక్కడికి వచ్చి తమకు తోచిన సాయం అందిస్తునానరు. జ్యోతి సేవలను గుర్తించిన ఐసీడీఎస్ ఉన్నతాధికారులు 2018-19లో ఆమెకు ఉత్తమ అంగన్వాడీ టీచర్ పురస్కారాన్ని ప్రకటించారు. గతేడాది మార్చిలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలో ఆమె కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నది.
పిల్లలంటే ఇష్టం..
నాకు పిల్లలంటే ఇష్టం. గొత్తికోయల కుటుంబాలకు చెందిన పిల్లలు పోషకాహారం లోపంతో బాధఫడుతుంటారు. వారికి కేంద్రం నుంచి పోషకాహారం అందిస్తున్నా. ఆరోగ్యవంతులను చేస్తున్నా. వారికి పాఠాలు చెప్తున్నా. సేవలను చూసి ఎంతోమంది దాతలు కేంద్రానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
– జ్యోతి, అంగన్వాడీ టీచర్, గంగమ్మకాలనీ