పుస్తకాలు చదవడం వల్లనే జ్ఞాన సముపార్జన సాధ్యం
బుక్ ఫెయిర్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు
పల్లెలకూ పుస్తకాలను తీసుకెళ్లడమే లక్ష్యం: జూలూరి గౌరీశంకర్
ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 7: ప్రస్తుత గ్లోబలీకృత ప్రపంచంలో పిల్లలకు సెల్ఫోన్లను దూరంపెట్టి పుస్తకాలను దగ్గర పెట్టాలని అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం పుస్తక మహోత్సవంలో ఆరో రోజైన మంగళవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో న్యాయమూర్తి కీలకోపన్యాసం చేశారు. ప్రతి ఒక్కరికీ జ్ఞానం అవసరమని, పుస్తకాలు చదవడం వల్లనే జ్ఞానాన్ని సంపాదించవచ్చునని అన్నారు. జ్ఞానం ప్రతి వ్యక్తికీ కెరటం లాంటిదని అభివర్ణించారు. బుక్ ఫెయిర్ నిర్వాహకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. మహా నగరాల నుంచి మారుమూల పల్లెలకూ పుస్తక ప్రదర్శనలను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని అన్నారు.
ఖమ్మానికి పుస్తక ప్రదర్శనలు కొత్తకాదని, గతంలో కవి యాకుబ్ ఆధ్వర్యంలో రొట్టమాకిరేవులాంటి మారుమూల పల్లెలోనూ నిర్వహించామని గుర్తుచేశారు. వాగ్గేయకారుడు జయరాజు మాట్లాడుతూ.. ప్రకృతిని మించినది ఏదీ లేదని అన్నారు. అనంతరం తన గేయాలు ఆలపించి శ్రోతలను అలరించారు. జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జీ.శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎండీ జావెద్పాషా, ప్రజావాగ్గేయకారులు శేషగిరి, గోవింద్, వెంకటయ్య, విద్యావేత్త ఐవీ రమణారావు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త అట్లూరి వెంకటరమణ, ప్రముఖ కార్డియాలజిస్ట్, రచయిత ఎంఎఫ్ గోపీనాథ్, నిర్వాహకులు సీతారాం, ప్రసేన్, రవిమారుత్, క్రాంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఉదయం 10 గంటల నుంచే..
ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరుగుతున్న పుస్తక మహోత్సవం బుధవారంతో ముగుస్తున్న సందర్భంగా చివరిరోజున ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్ తెలిపారు.