ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 3 : దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలు గురువారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జరగనున్నట్లు కోఆర్డినేటర్ పార్వతిరెడ్డి తెలిపారు. జిల్లా లో 6 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మెయిన్స్ పరీక్షలకు 5,296 మంది, 12న జరిగే బీఆర్క్ పరీక్షకు 884 మంది హాజరవుతారని పేర్కొన్నారు. బొమ్మ ఇంజినీరింగ్, శ్రీచైతన్య ఇంజినీరింగ్, ఎస్బీఐటీ, విజయ ఇంజినీరింగ్, కవిత మెమోరియల్ డిగ్రీ, ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ మోడల్ స్కూల్స్లో ప్రవేశాల కోసం ఈ నెల 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు.