భద్రాచలం, ఏప్రిల్ 1: గిరిజన, ఎస్హెచ్జీ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, వారికి జీవనోపాధి కల్పించేందుకు భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్, సెర్ప్ సీనియర్ మేనేజర్ భవాని శంకర్ పేర్కొన్నారు. జిల్లాలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నడుపుకుంటున్న మహిళలు తాము తయారు చేసే నిత్యావసర సరుకులు దళారులకు విక్రయించకుండా భద్రగిరి మార్ట్లో అందించి జీవనోపాధి పొందాలని సూచించారు.
పట్టణంలో గల భద్రగిరి మార్ట్లో నిత్యావసర సరుకులను సెర్ప్ సీనియర్ మేనేజర్తో కలిసి పీవో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ తాము తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని పలువురు గిరిజన మహిళలు కోరారని, దీంతో భద్రగిరి మార్ట్ను వారికి అనుకూలంగా మార్చడంతోపాటు ప్రజలకు నాణ్యమైన సరుకులను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందన్నారు.
అనంతరం మార్ట్లోని నిత్యావసర సరుకులను పరిశీలించి, వాటి తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్న సెర్ఫ్ సీనియర్ మేనేజర్.. తమ సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఏపీవో పవర్ వేణు, జేడీఎం హరికృష్ణ, డీఎం జీసీసీ సమ్మయ్య, మేనేజర్ ఆదినారాయణ, జీసీసీ మేనేజర్ జయరాజ్, భద్రగిరి మార్ట్ మేనేజర్ భార్గవి, డీపీఎం నర్సయ్య, ఏపీఎం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.