భద్రాచలం, ఫిబ్రవరి 1: భద్రాచలం ఏజెన్సీ ఏరియాలోని గిరిజన ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. భారత ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాంస్కృతిక బృంద సభ్యులు గురువారం ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి, పలు అంశాల్లో సర్వే చేపట్టి అనంతరం భద్రాచలం చేరుకున్నారు. ఐటీడీఏ కార్యాలయంలో పీవోను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ఆదివాసీల అభ్యున్నతి కోసం సర్వే చేపడుతున్నందుకు బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నదన్నారు.
బృంద జగదల్పూర్ సభ్యుడు డాక్టర్ పీఎస్ రంగసాధు మాట్లాడుతూ.. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని 12 గ్రామాల్లో తమ బృందం సర్వే చేపట్టిందన్నారు. గిరిజనుల ఆచార వ్యవహారాలు, పండుగలపై అధ్యయనం చేశామన్నారు. సర్వేకు సహాయ సహకారాలు అందించిన ఏపీవో జనరల్ డేవిడ్రాజ్, జీసీడీవో అలివేలు మంగతాయారుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. తమ సర్వే రిపోర్టులను భారత ప్రభుత్వానికి సమర్పించి, గిరిజనులకు సాయం అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో బృంద సభ్యులు అనుపమ్ దత్తా, రాంబాబు, మౌనికాదేవి, డాక్టర్ చంద్ర డోల్, ప్రాంజలిరాం టేకీ, రిషి కొల్పన్, రత్నాకర్పలే, సంజనేర్ బేరా పాల్గొన్నారు.