తల్లిదండ్రుల కష్టాలను కళ్లారా చూస్తూ చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను సద్వినియోగం చేసుకుంటూ రేయింబవళ్లు కష్టపడి పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యను అభ్యసించారు. ఇందులో రైతు కుటుంబాలు, రోజువారీ, ప్రైవేటు కంపెనీలు, షాపుల్లో పనిచేసే చిరుద్యోగుల పిల్లలే ఎక్కువ. దూర ప్రాంతాల్లో ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ.. అక్కడి వాతావరణం అనుకూలించక.. అమ్మానాన్నలకు దూరంగా ఉంటూ అవస్థలు పడేవారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంత్రి పువ్వాడ అజయ్ కృషితో ఖమ్మం నగరానికి ఐటీ హబ్ వచ్చింది. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఉన్న ఊరిలోనే ఐటీ కొలువులు సాధించడానికి తెలంగాణ సర్కారు బాటలు వేసింది. ఎడ్యుకేషన్ హబ్గా నిలిచిన ఖమ్మం.. ఇప్పుడు ఐటీ రంగంలోనూ అదే స్థానాన్ని పొంది కొలువుల గుమ్మం అయ్యింది. ఖమ్మంలో 16 కంపెనీలతో ఐటీ హబ్ను ఏర్పాటు చేయగా.. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు సాధించిన సుమారు 1,500 మంది విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అందిస్తున్నారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 14 : సమాచార సాంకేతిక రంగంలోనూ ఖమ్మం నగరం చోటు సంపాదించుకున్నది. సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు లోకల్ మేడ్గా నిలుస్తోంది. నిజానికి మల్టీ నేషనల్ కంపెనీ(ఎంఎన్సీ)ల్లోనూ, అందునా సాఫ్ట్వేర్ సంస్థల్లోనూ ఉద్యోగాలు చేయాలంటే ఇంతకుమునుపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కేంద్రాలైన బెంగుళూరు, హైదరాబాద్ నగరాలకో, లేక చెన్నై నగరానికో వెళ్లాల్సి వచ్చేది. కానీ.. కాలం మారింది. ఇప్పుడు మన ఖమ్మమే సాఫ్ట్వేర్ కొలువుల గుమ్మమైంది. కచ్చితంగా చెప్పాలంటే ‘క్రెడిట్ గోస్ టూ బీఆర్ఎస్ గవర్న్మెంట్’. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం ఎంఎన్సీ ఐటీ కంపెనీలన్నీ తమ కార్యాలయాల స్థాపనలు, ఉత్పత్తులు, సేవల కోసం హైదరాబాద్కే వచ్చేవి. కానీ.. అప్పటి ప్రభుత్వాల నిర్ణయాలు, అనిశ్చితుల కారణంగా నేరుగా బెంగుళూరు వెళ్లేవి. కానీ.. తెలంగాణ సిద్ధించాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అనేక ఎంఎన్సీ ఐటీ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగానే కార్యాలయాలు స్థాపించి ఉత్పత్తులు ప్రారంభిస్తున్నాయి. అందునా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే ఐటీ రంగం తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించింది. మన బిడ్డలు మన కళ్ల ముందే ఉద్యోగాలు చేసుకునే అవకాశం లభించింది.
లోకల్ మేడ్.. లోకల్ జాబ్కు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది ఖమ్మం కేంద్రంగా ఏర్పాటైన ఐటీ హబ్. కన్నవాళ్లను వదిలి ఎక్కడికీ వెళ్లకుండా ఉన్న చోటనే కొలువు చేసుకునే అవకాశం తెలంగాణ సర్కారు ద్వారా లభించింది. డిగ్రీ, బీటెక్ చదివిన ఉమ్మడి ఖమ్మం జిల్లా యువతీ యువకులు కుటుంబానికి దగ్గరగా ఉంటూనే ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. బడా కంపెనీలు సైతం మెట్రో నగరాలతోపాటు ఐటీ హబ్ల ఏర్పాటుతో వాటి సేవలు అందిస్తున్నాయి. ఇక్కడే చదివి, ఇక్కడే ఉద్యోగాలు రావడంతో యువత కూడా సంబురపడి పోతోంది. దీంతో వారి తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నాయి.
ఐటీ రంగమంటేనే ప్రతిభకు కొలమానం. అందులో అవకాశం పొందాలంటే అదృష్టాలకంటే ట్యాలెంటే గీటురాయిగా నిలుస్తుంది. ఇంతటి తీవ్రమైన పోటీ ఉన్న రంగంలో జిల్లాల నుంచి వెళ్లిన విద్యార్థులు మెట్రో నగరాల్లోని సాఫ్ట్వేర్ కొలువులు సాధించాలంటే అక్కడి యువతకు మించిన మరెంతో ప్రతిభ, సాధన ఉండాలి. కానీ.. తెలంగాణ ప్రభుత్వం జిల్లా కేంద్రాలకు ఐటీని విస్తరించడం స్థానిక యువతకు గొప్పవరం. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్లు కూడా ఐటీని ప్రోత్సహించడం, ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంతో కొద్దిపాటి మెరుగైన విద్యార్థులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలను సాధించే అవకాశం కలిగింది. అందుకోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మంలో 16 కంపెనీలతో ఐటీ హబ్ను ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 1,500 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి వివిధ కేటగిరీల్లో పనిచేస్తూ సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అందిస్తున్నారు. ఖమ్మం నగరం నడిబొడ్డున దాదాపు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ ఫోర్ అధునాతన భవనంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఐటీ హబ్ను నిర్మించింది. హైదరాబాద్ తర్వాత ఎడ్యుకేషన్ హబ్గా ఇప్పటికే ఖమ్మం నిలిచింది. ఇప్పుడు ఐటీ రంగంలోనూ అదే స్థానాన్ని పొందింది.
ఖమ్మం నగరానికి కొద్ది దూరంలో ఉన్న రామన్నపేట గ్రామం మాది. నాన్న రాజు, అమ్మ రమాదేవితోపాటు చదువుకునే రోజుల్లో పొలంలో పనిచేస్తుండేదాన్ని. అమ్మానాన్నల కష్టాన్ని చూసి ఇంజినీరింగ్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించా. అప్పుడే ఖమ్మంలో ఐటీ హబ్ పూర్తి కావడం.. రిక్రూట్మెంట్లు నిర్వహిస్తుండడంతో టాస్క్ ద్వారా శిక్షణ తీసుకుని ఉద్యోగం సాధించా. నేను కలలో కూడా అనుకోలేదు ఖమ్మం వంటి పట్టణానికి ఐటీ కంపెనీలు వస్తాయని. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది. మంత్రి కేటీఆర్ సార్ వల్లనే ఐటీ హబ్ వచ్చిందని నాతో రోజూ నాన్న అంటుంటడు.
ఖమ్మంలోని ఐటీ హబ్లో జాబ్మేళా నిర్వహించడంతో డిగ్రీ పూర్తి చేసిన నేను ఇంటర్వ్యూకు ఎంపికయ్యాను. ఇక్కడ ఐటీ హబ్ లేకపోతే ఉద్యోగం చేయలేకపోయేదాన్ని. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి.. ఐటీని జిల్లాకు తీసుకురావడం మాలాంటి వారికి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించినైట్లెంది. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న రాము గ్రానైట్ కంపెనీలో పనిచేస్తుండగా.. అమ్మ రోజ గృహిణి. వారితో ఉంటూ ఉద్యోగం చేయడమనేది నిజంగా నేను ఐటీ హబ్ ద్వారా చేసుకున్న అదృష్టం. నైట్ షిఫ్ట్లో పని చేస్తున్న ఎందరో మహిళా ఉద్యోగులకు అవసరమైన రక్షణ ఇక్కడ ఉంది.
కోవిడ్ సమయంలో డిగ్రీ పూర్తి చేసిన నేను నెల రోజుల సమయంలోనే ఖమ్మంలోని ఐటీ హబ్లో ఉద్యోగం సాధించాను. ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. నా అదృష్టం ఏమిటంటే.. అమ్మానాన్నలతో ఉంటూ ఉద్యోగం చేయడం. థ్యాంక్స్ టూ కేసీఆర్ సార్, కేటీఆర్ సార్. ఖమ్మంలో ఐటీ హబ్ పెట్టడం వల్ల హైదరాబాద్, బెంగుళూర్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్న ఊళ్లోనే పని చేసుకునే అవకాశం కల్పించారు. మా అమ్మానాన్న నేను చదువుకునే సమయంలో ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు అమ్మాయిని పంపాలా.. అని కంగారుపడేవారు. కానీ.. ఇక్కడే ఐటీ హబ్తో సంతోషంగా ఉన్నారు.
చదువుకునే రోజుల్లో ఐటీ జాబ్ చేయాలనే కోరిక ఉండేది. డిగ్రీ తర్వాత పెళ్లయింది. వృత్తిరీత్యా నా భర్త శ్రీనివాసచారి ఖమ్మంలో టాటా కంపెనీలో పనిచేస్తుంటారు. ఇక సాఫ్ట్వేర్ జాబ్ చేయడం సాధ్యం కాదనుకున్నా. కానీ.. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ ఐటీ హబ్ ఏర్పాటు చేయడంతో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. మహిళలు వేరే ప్రాంతానికి వెళ్లి ఉద్యోగం చేయడమంటే చాలా సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఖమ్మంలో ఐటీ హబ్ ఫేస్-1 పూర్తి కాగా.. ఫేస్-2 పనులు కూడా జరుగుతున్నాయి. ఖమ్మం ఐటీ హబ్లో మహిళా ఉద్యోగులే ఎక్కువ.
ఖమ్మంలో ఉన్న వాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత ఊళ్లోనే ఉద్యోగం చేసుకునే అవకాశం ఐటీ హబ్తో సాధ్యమైంది. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడమంటే ఆరోగ్యం విషయంలో సమస్యలు ఉంటాయి. నాన్న కళ్యాణ్చక్రవర్తి మొబైల్ షాపు నడుపుతుండగా.. అమ్మ జ్యోతిప్రసన్న ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నారు. నేను ఇంటి వద్ద నుంచి 5 నిమిషాల్లో ఐటీ హబ్కు చేరుకుంటా. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది. ఇదంతా ఐటీ హబ్ వల్లనే అని, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కృషి అని నాన్న చెబుతుంటారు.
బీటెక్ పూర్తయిన వెంటనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్ వెళ్లి కోర్సులు నేర్చుకున్నా. ఈ సమయంలో ఇంటికి దూరంగా ఉన్నా అనే బెంగతోపాటు హాస్టల్ ఫుడ్ కూడా పడలేదు. ఇక ఇంటికి వచ్చేశా. అప్పుడు ఖమ్మం ఐటీ హబ్లో జాబ్మేళా జరుగుతున్నదని తెలిసి ఇంటర్వ్యూకి వెళ్లడంతో ఉద్యోగం వచ్చింది. సొంతూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. నాన్న కృష్ణప్రసాద్ మమత హాస్పిటల్లో పనిచేస్తారు. అమ్మ శ్రీదేవి గృహిణి. మేము ఇద్దరం ఆడపిల్లలం. ఇతర ప్రాంతాల్లో సాప్ట్వేర్ జాబ్ అంటే తల్లిదండ్రులు కంగారు పడేవారు. అమ్మానాన్నలను చూసుకుంటూ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నా.
నా చదువంతా ఖమ్మంలోనే. బీటెక్ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లా. అక్కడే కొన్ని రోజులు జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే పరిస్థితులు బాగా లేవని మళ్లీ ఇంటికి వచ్చా. అప్పుడు ఖమ్మం ఐటీ హబ్లో జరుగుతున్న రిక్రూట్మెంట్కి హాజరయ్యా. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఐటీ హబ్ నాకు ఓ మంచి అవకాశాన్నిచ్చింది. నాన్న శ్రీనివాసరావు, అమ్మ విజయలక్ష్మి గృహిణి. ఖమ్మం ఐటీ హబ్లో జాబ్ చేస్తుండడంతో అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ల కండ్ల ముందే ఉండడంతో వారికి ధైర్యంగా ఉంది.
ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నా. తెలంగాణ ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ సైతం పూర్తి చేశాను. ప్రభుత్వ కృషి వల్ల ఏర్పాటైన ఐటీ హబ్లో జాబ్ రావడం సంతోషంగా ఉంది. నాన్న వెంకన్నకు కొంత వైకల్యం ఉన్నా వెల్డింగ్ పనులు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేసే ధైర్యం లేదు. నేను ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉండాలనుకున్నా. ఐటీ హబ్ ఖమ్మంకు వస్తుందని అనుకోలేదు. ఖమ్మంలోనే జాబ్ అంటే అమ్మానాన్న చాలా సంతోషంగా ఉన్నారు.
నాన్న రామారావు పోలీస్ డిపార్ట్మెంట్. అమ్మ సుధ గృహిణి. నేను ఒక్కదాన్నే కావడంతో చదువు తర్వాత ఉద్యోగం అంటూ పొరుగు రాష్ర్టాలకో, ఇతర దేశాలకో వెళ్తాననే బెంగ ఉండేది. ఖమ్మంలో ఐటీ హబ్ పెట్టడం.. అందులో జాబ్ తెచ్చుకోవడంతో నా కంటే అమ్మానాన్నే ఎక్కువ సంతోషపడ్డారు. ఇంటి వద్ద నుంచే జాబ్కు వెళ్లడం, కుటుంబంతో కలిసి ఉండడంతో ఒత్తిడి లేకుండా ఉంది. కుటుంబానికి దూరంగా ఉంటే జాబ్తో కూడిన ఒత్తిడితోపాటు పేరెంట్స్ని మిస్ అవుతున్నామనే ఒత్తిడి కూడా ఉంటుంది. ఖమ్మంలో ఐటీ హబ్ వల్ల రెండేళ్ల నుంచి సంతోషంగా పని చేసుకుంటున్నా.