ఖమ్మం : అటవీ జంతువులను వేటాడే వేటగాళ్లపై అదేవిధంగా అడవి నాశనం చేసే కలప స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాల్సిందిగా అధికారులను ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. రెవెన్యూ, అటవీ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిందిగా కోరారు. పీడీ యాక్ట్తో పాటు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ ఫారెస్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. ఖమ్మం జిల్లాస్థాయి అటవీ, వన్యప్రాణుల రక్షణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అన్ని టింబర్ డిపోల యజమానులు కొనుగోలు, అమ్మకం రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. అక్రమ మార్గంలో ఎవరైనా కలపను తరలించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలక్ట్రిక్ ట్రాప్స్ను ఉపయోగించి జంతువులను వేటాడే వారిపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. అటవీ భూములను మార్క్ చేయాల్సిందిగా సూచించారు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా, ఆక్రమించుకోకుండా సరిహద్దులు గుర్తించాలన్నారు.
అటవీ భూముల్లో మొక్కల పెంపకం చేపట్టే క్రమంలో స్థానికుల నుంచి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలన్నారు. దీనిపై సీపీ విష్ణు ఎస్ వారియర్ స్పందిస్తూ.. అటవీశాఖ అధికారులకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ సమావేవంలో అడిషనల్ కలెక్టర్లు ఎన్. మధుసూదన్, ఎం స్నేహలత డీఎఫ్వో ప్రవీణ, డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ ప్రసన్న కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయ నిర్మల, ఉద్యానవనశాఖ అధికారి జి.అనసూయ, ఇతర అధికారులు పాల్గొన్నారు.