భద్రాచలం, జనవరి 16 : జాతీయ స్థాయిలో అనేక ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిర్వహించే ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీలో బుధవారం నిర్వహించే సర్వే రిపోర్ట్ విడుదల కార్యక్రమానికి హాజరుకావాలని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ వేముల కామేశ్వరరావుకు ఆహ్వానం పంపింది. పట్టణానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కామేశ్వరరావు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు పేద విద్యార్థుల చదువుకు తనవంతుగా సాయం అందిస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ ఎందరో నిరుపేదలకు ఉచితంగా ఆహారం పంపిణీ చేశారు. కాగా.. ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ గత ఏడాది దేశవ్యాప్తంగా 14 ఏళ్లలోపు పిల్లలకు విద్య, వివిధ అంశాల స్థితిగతులు తెలుసుకునేందుకు సర్వే చేపట్టింది. ఆ సర్వే రిపోర్టును బుధవారం విడుదల చేస్తున్న సందర్భంగా కామేశ్వరరావుకు ఆహ్వానం పంపడంతోపాటు విమానయాన ఖర్చులను సైతం ఆ సంస్థ ప్రతినిధులు చెల్లించడం విశేషం.