ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 13 : ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ విద్యార్థులకు ఈ నెల 15 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడుదశల్లో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవిబాబు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని కళాశాలలు అన్ని స్పెల్స్లో వచ్చేలా షెడ్యూల్ను రూపొందించారు. ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్ విద్యార్థులు ప్రాక్టికల్స్ రాయనున్నారు. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన ప్రాక్టికల్స్ మార్చి 2వ తేదీ వరకు జరగనున్నాయి.
ఓటీపీ ద్వారా ప్రశ్నాపత్రం..
ప్రాక్టికల్స్ రాసే విద్యార్థులకు అందజేసే ప్రశ్నాపత్రాన్ని ఇంటర్ బోర్డు నూతన విధానం ద్వారా అందజేస్తున్నది. కేంద్రాలకు కేటాయించిన ఎగ్జామినర్ల ఫోన్లకు ఓటీపీ వస్తున్నది. ఆ ఓటీపీ నమోదు చేసిన తర్వాతనే ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకునేలా ఇంటర్ బోర్డు పకడ్బందీ విధానాన్ని అమలు చేస్తున్నది. పరీక్షకు అరగంట ముందు ప్రశ్నాపత్రాలు ఆన్లైన్లో ఉంటాయి. ఎగ్జామినర్ సెల్ఫోన్కు మెసేజ్ రాగానే ఆయన సంబంధిత వెబ్సైట్ నుంచి ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్విజిలేటర్స్కు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్రశ్నలు ముందుగా తెలిసే అవకాశం ఉండదు. అలాగే హాల్టిక్కెట్ ఆధారంగా ఏ విద్యార్థికి ఏ సెట్ ప్రశ్నాపత్రం ఇవ్వాలనే అంశాన్ని పేపర్ కోడ్ల ఆధారంగా వెబ్సైట్లో పేర్కొంటారు. కళాశాలల వారీగా ప్రశ్నాపత్రాల కోడ్లు వేర్వేరుగా ఉండటంతోపాటు పరీక్ష సమయానికి అరంట ముందుగా ఇన్విజిలేటర్ హాల్టిక్కెట్ ఆధారంగా ప్రశ్నాపత్రం డౌన్లోడ్ చేసి ఇచ్చేలా మార్పులు చేశారు.
వెంటనే మూల్యాంకనం…
ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 2 వరకు జరగనున్నాయి. ఈ ప్రయోగ పరీక్షల్లో ఏ సెషన్లో పరీక్ష రాసినా విద్యార్థుల సమాధాన పత్రాలను వెంటనే మూల్యంకనం చేయనున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా జరగనున్నాయి. పరీక్ష ముగిసిన అనంతరం గంటలోపే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. మూల్యంకనం చేసిన మార్కుల జాబితాను ఎగ్జామినర్ ఇంటర్బోర్డుకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎగ్జామినర్లకి డీఐఈవో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జనరల్కు 81, ఒకేషనల్కు 26 కేంద్రాలు…
ఖమ్మం జిల్లాలో జనరల్కు 81 కేంద్రాలు, ఒకేషనల్కు 26 కేంద్రాలు ఎంపిక చేశారు. జిల్లాలో 14,435 మంది జనరల్ కోర్సుల విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరుకానున్నారు. 4,763 మంది వృత్తి విద్యాకోర్సుల వారు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను మూడు దశల్లో నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ కేటాయించారు. స్పెల్ను 5 రోజులపాటు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. బుధవారం మొదలయ్యే ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 2వ తేదీతో ముగియనున్నాయి. పరీక్షల నిర్వహణకు డీఐఈవో కె రవిబాబు, డీఈసీ సభ్యులు పర్యవేక్షించనున్నారు. మొదటి స్పెల్ ఈ నెల 15 నుంచి 20 వరకు, రెండో స్పెల్ ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు, మూడో స్పెల్ ఈ నెల 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు 2 ప్లయింగ్ స్కాడ్ బృందాలు (వీటిలో ఫిజిక్స్ లెక్చరల్, కెమిస్ట్రీ లెక్చరర్), 1 డెక్ కమిటీ (ఇద్దరు ప్రిన్సిపాల్స్, 1 లెక్చరర్) పర్యవేక్షణ చేయనున్నారు.
హాల్టిక్కెట్స్ ఆపితే చర్యలు..
ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్టిక్కెట్స్ ఆపితే కఠిన చర్యలు ఉంటాయి. విద్యార్థులు హాల్టిక్కెట్స్లోని తేదీలు సెషన్లు చూసుకొని పరీక్షలకు హాజరుకావాలి.
– డీఐఈవో రవిబాబు