ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 14: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఈ నెల 16న ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఐఈవో రవిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలో జనరల్ విభాగం విద్యార్థులకు 20 మార్కులు, ఒకేషనల్ విద్యార్థులకు 10 మార్కులు కేటాయించనున్నట్లు చెప్పారు.
జిల్లాలోని 131 కళాశాలల నుంచి జనరల్ విభాగంలో 16,006 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 2,462 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వివరించారు. ఈ నెల 17న నైతికత, మానవ విలువల పరీక్ష, 19న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలని సూచించారు.