వారంతా వలస గొత్తికోయలు.. బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని సరిహద్దు దాటి రాష్ట్రంలోకి వచ్చారు. అడవిలో అల్లంతదూరాన ఒకే చోట ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. చుంచుపల్లి మండలం మూలుగుగూడెం గ్రామానికి దూరంగా ఉన్న పాలవాగు వద్ద 35 కుటుంబాలు ఒక గుంపుగా నివసిస్తున్నాయి. 30 ఏళ్ల క్రితం తమ ఊరు, ప్రాంతాన్ని వదిలి భద్రాద్రి జిల్లాకు వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు వారిని పట్టించుకోలేదు. గూడేనికి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వలస గొత్తికోయలను అక్కున చేర్చుకున్నది. కారుచీకట్లలో మగ్గిపోయిన ఆ గూడేనికి వెలుగుదివిటీగా నిలిచింది. సకల సౌకర్యాలు కల్పించి వారి జీవితాల్లో కాంతులు నింపింది. గతంలో అంధకారంతో కొట్టుమిట్టాడిన ఆ గూడేనికి సౌర విద్యుత్ ద్వారా వెలుగులు పంచింది. అంతేకాదు, ప్రభుత్వ పథకాలు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నది.
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 9 (నమస్తే తెలంగాణ): విశాల దృక్పథానికి ప్రతిరూపంగా నిలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దేశ ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తోంది. అందుకే ఇక్కడి నాయకత్వాన్ని, ఇక్కడి పథకాలను దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలూ కోరుకుంటున్నారు. అంతేకాదు.. పొరుగు రాష్ర్టాల నుంచి వలస వచ్చిన ప్రజలనూ అక్కున చేర్చుకుంటోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడి పథకాలన్నింటినీ వారికి అందిస్తూ ఆదరిస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదైనా రాష్ట్రం నుంచి ఎవరైనా ప్రజలు పొట్టకూటి కోసం వస్తే కనీసం వారిని పలుకరించి పట్టెడన్నం పెట్టలేదు నాటి పాలకులు. కానీ బతుకుదెరువు కోసం రాష్ర్టాలు దాటి వచ్చిన పొరుగు రాష్ర్టాల ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు.. సకల సౌకర్యాలు కల్పించి అక్కున చేర్చుకుంటోంది. ఈ కోవలోకే వస్తారు చుంచుపల్లి మండలంలోని వలస గొత్తికోయలు. పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్కు చెందిన గొత్తికోయలు బతుకుదెరువు కోసం చాలా ఏళ్ల క్రితం భద్రాద్రి జిల్లాకు వచ్చారు.
చుంచుపల్లి మండలం మూలుగుగూడేనికి దూరంగా నివాసాలు ఏర్పాటు చేసుకొని ఒక గుంపుగా జీవిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 35 కుటుంబాల వారు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్లంతా ఇక్కడ పుట్టిన వాళ్లే. వాళ్ల తాతలు, తండ్రులు 30 ఏళ్ల క్రితం వలస వచ్చారు. పాలవాగు గుంపుగా ఏర్పాటు చేసుకొని వారు నివసిస్తున్న ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ఓ అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పొరుగు గ్రామంలో సర్కారు బడి ఉంది. గర్భిణులందరికీ మన వైద్యశాలల్లోనే వైద్య సేవలందుతున్నాయి. మన వైద్యులే వారికి ప్రసవాలు చేస్తున్నారు. కేసీఆర్ కిట్లనూ అందిస్తున్నారు. వారి గూడెంలో చీకట్లను పారదోలేందుకు సింగరేణి తరఫున సోలార్ లైట్లను ఏర్పాటు చేసింది.
తెలంగాణ సర్కారు తోడుగా..
30 ఏళ్ల క్రితమే ఇక్కడికి వలస వచ్చిన ఈ గొత్తికోయలు తెలంగాణ రాకముందు అనేక ఇబ్బందులు పడ్డారు. స్వరాష్ట్రం వచ్చాక మాత్రమే వారికి కూడా మౌలిక సధుపాయాలు అందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వారికి రేషన్, ఆధార్, ఓటు గుర్తింపు కార్డులను అందజేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో వారి పిల్లల వివరాలను నమోదు చేసుకున్నది. దీంతో వారు, వారి పిల్లలు తెలంగాణ ప్రభుత్వ పథకాలకు అర్హులవుతున్నారు. చుంచుపల్లి మండలం మూలుగుగూడెం గ్రామానికి దూరంగా ఉన్న పాలవాగు.. మండల కేంద్రానికి దూరం అయినప్పటికీ వారికి పెనగడప పంచాయతీ అందుబాటులో ఉంటుంది. దీంతో ఆసుపత్రికి వెళ్లాలన్నా, పిల్లలను బడికి పంపాలన్నా మూలుగుగూడెం గ్రామం కాలినడక వెళ్తుంటారు. ఆరోగ్య కార్యకర్తలు కూడా ఆ గుంపునకు వెళ్లి అక్కడి గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్నారు.
‘అమ్మ ఒడి’ వాహనం తెచ్చారు
తెలంగాణ ప్రభుత్వం మమ్ములను ఆదుకుంటోంది. నాకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే నర్సుకు చెప్పాను. ఆమె ‘అమ్మ ఒడి’ వాహనాన్ని రప్పించింది. అందులో నన్ను రామవరం పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు, సిబ్బంది బాగా చూసుకున్నారు. మూడురోజుల్లో చంటి బిడ్డతో క్షేమంగా ఇంటికి చేర్చారు. ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ ఇచ్చారు. రూ.12 వేలు నగదు సాయం కూడా అందింది.
-వెట్టి లక్ష్మి, కేసీఆర్ కిట్ అందుకున్న బాలింత
చాలా కాలం చీకట్లో ఉన్నాం..
తెలంగాణ రాకముందే మేం చాలా కాలం చీకట్లో ఉన్నాం. తెలంగాణ వచ్చాక మా గుంపులో సోలార్ లైట్లు అమర్చారు. రాత్రి 6 గంటలకు లైట్లు వెలుగుతాయి. పగలంతా పనులకు వెళ్తాం. పిల్లలకు బడి కూడా దగ్గర్లోనే ఉంది. అంగన్వాడీ ఇక్కడే ఉంది. రేషన్ బియ్యం కూడా అందిస్తున్నారు.
-భీమా, గొత్తికోయ, పాలవాగు
కేసీఆర్ కిట్ ఇచ్చారు..
నాకు మూడు నెలల గర్భం ఉన్నప్పుడు నర్సు వచ్చి నా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. తర్వాత సూది మందులు వేశారు. నెలకు సరిపడా మందులు ఇచ్చి పంపారు. బుట్టలో పండ్లు, బలానికి గోళీలు ఇచ్చారు. 9 నెలలకు కాన్పునకు తీసుకెళ్లారు. అన్నీ ఉచితంగానే చేశారు. కేసీఆర్ కిట్ కూడా అందించారు. అందులో బిడ్డకు సబ్బులు, పౌడర్లు, దుస్తులు ఉన్నాయి. వాటినే వినియోగించుకున్నాం.
-ముక్తి జ్యోతి, కేసీఆర్ కిట్ అందుకున్న బాలింత