లక్ష్మీదేవిపల్లి, ఫిబ్రవరి 28: ఒకప్పుడు సమస్యల లోగిళ్లలో కొట్టుమిట్టాడిన ఆ పాఠశాల.. తెలంగాణ సిద్ధించాక ఆదర్శ పాఠశాలగా రూపుదిద్దుకున్నది. ప్రత్యేక సొబగుల సర్కారు బడిగా నిలిచింది. సకల సౌకర్యాల నిలయమంటే ఆ విద్యాలయమే అన్నంతలా ప్రాచుర్యం పొందింది. కార్పొరేట్కు దీటుగా మారింది. అదే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ పంచాయతీలోని ఇందిరానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. విజ్ఞానం, వికాసం, పరిశుభ్రతపై ఆ పాఠశాల హెచ్ఎం ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆదర్శ పాఠశాలగా నిలిచింది. ఏకంగా స్కూల్ లీడర్షిప్ అకాడమీ పుస్తకంలో చోటు సంపాదించుకున్నది. ప్రస్తుతం ఒకటి నుంచి 5వ తరగతి అభ్యసించే విద్యార్థులు 100మంది ఉండగా.. స్కౌట్స్ అండ్ గైడ్స్తో ఈ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. విద్యాబోధనతోపాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఇక్కడ అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి ఆదివారంతోపాటు పండుగ రోజులు, వేసవి సెలవుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠాలు బోధిస్తున్నారు. ఇప్పుడు ‘మన ఊరు మన బడి’ నిధులతో అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకెళ్తున్నది.
ఒకప్పుడు సమస్యల లోగిళ్లలో కొట్టుమిట్టాడిన ఆ పాఠశాల.. తెలంగాణ సిద్ధించాక ఆదర్శ పాఠశాలగా రూపుదిద్దుకుంది. ప్రత్యేక సొబగుల సర్కారు బడిగా నిలిచింది. సకల సౌకర్యాల నిలయమంటే ఆ విద్యాలయమే అన్నంతలా ప్రాచుర్యం పొందింది. అదే.. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ పంచాయతీలోని ఇందిరానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. విజ్ఞానం, వికాసం, పరిశుభ్రతపై ఆ పాఠశాల హెచ్ఎం ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆదర్శ పాఠశాలనూ నిలిచింది. ఏకంగా స్కూల్ లీడర్షిప్ అకాడమీ పుస్తకంలోనూ చోటు సంపాదించుకుంది. కార్పొరేట్కు దీటుగా మారింది. ఇప్పుడు ‘మన మన ఊరు’ నిధులతో మరింత ముందుకు సాగుతోంది. చిన్న గదిలో అసౌకర్యాల నడుమ సాగిన ఈ పాఠశాల ఇప్పుడు ఆదర్శ పాఠశాలగా మారింది. రాష్ట్రస్థాయిలోనే గుర్తింపు తెచ్చుకుంది. దీని పురోభివృద్ధిలో ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిరాణిదీ ప్రముఖ పాత్ర ఉంది. ఈ పాఠశాలలో చదువుతోపాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ సహా అనేక అంశాల్లోనూ విద్యార్థులను తీర్చిదిద్దుతారు. అన్ని రంగాల్లో రాణించేలా తర్ఫీదునిస్తారు. ఇప్పటికే సింగరేణి సహకారంతో ఏర్పాటు చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ (బతుకమ్మ) యూనిట్ ప్రదర్శనలు దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ విభాగం ఏర్పాటు చేసిన స్కూల్ లీడర్ షిప్ అకాడమీలోనూ ఈ పాఠశాల చోటు సంపాదించింది.
ఇరుకు గది నుంచి కార్పొరేట్ స్థాయికి..
కేవలం ఒక్క గదిలో నిర్వహణ సాగిన పాఠశాల అది. హెచ్ఎం కృషి ఫలితంగా ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసింది దీంతో పక్కా భవనం నిర్మించారు. విద్యాబోధన కూడా మెరుగైన స్థాయిలో అందుతుండడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పచ్చదనం వెల్లివిరిసేలా ఈ పాఠశాలను తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి అభ్యసించే విద్యార్థులు 100 మంది ఉన్నారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్తో గుర్తింపు..
స్కౌట్స్ అండ్ గైడ్స్తో ఈ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే సింగరేణి సౌజన్యంతో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్లాక్ యూనిట్ను బతుకమ్మ యూనిట్ పేరుతో ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో విద్యార్థులకు యూనిఫామ్, బెల్ట్లు, స్కార్ప్లు అందించారు. ఈ యూనిట్ ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి అబ్బుతాయనేది ఈ యూనిట్ ఏర్పాటు వెనుక ఉద్దేశం. 2016లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో నిర్వహించిన జాతీయస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉత్సవానికి ఈ పాఠశాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ర్టాల నుంచి ప్రాథమిక పాఠశాలల స్థాయిలో హాజరైంది ఈ పాఠశాల విద్యార్థులు మాత్రమే.
విద్యాబోధనతోపాటు ఆటపాటలు..
ఈ పాఠశాలలో విద్యాబోధనతోపాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలకూ అధిక ప్రాధాన్యం ఉంటుంది. వీటిని నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. ప్రతి ఆదివారంతోపాటు పండుగ రోజులు, వేసవి సెలవుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠాలు బోధిస్తున్నారు. కథలు, జాతీయ నాయకుల గొప్పతనం, మొక్కల సంరక్షణ, ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు వివరిస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠాలు బోధిస్తారు. శనివారం ఆటలు, పాటలు, క్విజ్, చిత్రలేఖనం, ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం ఎఫ్ఎం రేడియో స్టేషన్ ద్వారా విద్యార్థులు పాటలు, కథలు, సూక్తులు, పొడుపు కథలు, చిట్కాలు వినిపిస్తున్నారు. వీటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేస్తున్నారు. అలాగే హెల్పింగ్ హ్యాండ్ అనే ఎన్జీవో ద్వారా చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు సహకారమూ అందిస్తున్నారు.
మరింత అభివృద్ధి చేసుకోగలిగాం..
మా పాఠశాలలోని ఒకటి నుంచి ఐదు తరగతుల్లో 100 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించుకున్నాం. పచ్చనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనిని యూపీఎస్గా అప్గ్రేడ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులూ కోరుతున్నారు. పాఠశాలను సందర్శించే అధికారులు ఇక్కడి వాతావరణాన్ని, బోధనా పద్ధతులను చూసి ప్రశంసిస్తున్నారు. సింగరేణి సహకారంతో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేశాం. ప్రశాంతమైన వాతావరణం, పరిశుభ్రతపై స్వచ్ఛ భారత్లో భాగంగా హర్షమిత్ర అవార్డు తీసుకోగలిగాం. ఇప్పుడు ‘మన ఊరు – మన బడి’ నిధులతో మరింత అభివృద్ధి చేసుకోగలిగాం.
–మేకల జ్యోతిరాణి, హెచ్ఎం