అశ్వారావుపేట, డిసెంబర్ 30: ఆయిల్పాం సాగు విస్తరణకు అనుగుణంగా పామాయిల్ ఫ్యాక్టరీల సామర్థ్యం పెంచుతున్నామని ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 24 వేల ఎకరాల్లో కొత్తగా ప్లాంటేషన్ పూర్తి చేశామన్నారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేట మండలంలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను పరిశీలించి మాట్లాడారు. అశ్వారావుపేట, పెనుబల్లి, అప్పారావుపేట నర్సరీల్లో 12 లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నామన్నారు. 2025 నాటికి అప్పారావుపేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీల సామర్థ్యం గంటకు 180 టన్నులకు చేరుతుందన్నారు.
2026 నాటికి ఖమ్మం జిల్లా కల్లూరుగూడెంలో కొత్త ఫ్యాక్టరీ పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఆయిల్పాం రైతుకు ఎఫ్-కోడ్ అందిస్తామన్నారు. ఒకే రైతుకు వేర్వేరు ప్రాంతాల్లో ఆయిల్ఫాం తోటలు ఉండడం కారణంగా రవాణా ఛార్జీల చెల్లింపులో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. కౌలు విధానంలోనూ మార్పులు తీసుకొస్తున్నామన్నారు. అగ్రిమెంట్స్ ప్రకారం కోడ్స్ జారీ చేస్తామన్నారు. ఒక ఎకరాకు కనీసం 14 టన్నుల గెలల అంచనాగా నిర్ణయించి ఈ మేరకు ఫ్యాక్టరీలో దిగుమతి చేసుకుంటామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు మొక్కలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట సంస్థ జనరల్ మేనేజర్ టి.సుధాకర్రెడ్డి, పీఅండ్పీ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, డివిజనల్ ఆఫీసర్ బాలకృష్ణ, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్ ఉన్నారు.