ఖమ్మం, డిసెంబర్ 22 : తరతరాల చరిత్రను భవిష్యత్కు తెలియచెప్పే కట్టడాలు, భవనాలు తెలంగాణలో అనేకం ఉన్నాయి. ఆ కోవలోకే ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న సెయింట్ మేరీస్ చర్చి (సీఎస్ఐ) వస్తుంది. 122 ఏళ్ల కిత్రం నిర్మించిన ఈ చర్చి నేటికీ చెక్కుచెదరక పోవడం ఆనాటి కట్టడాల గొప్పతనానికి నిదర్శనం. నైజాం నవాబులు ఏలుతున్న కాలంలో చర్చి నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ప్రస్తుతం చర్చి ఉన్న ప్రాంతంలో అప్పట్లో దట్టమైన అడవి ఉండేది. వన్యప్రాణులు సైతం తిరిగేవని పెద్దలు చెప్తుంటారు. 1888లో చర్చి మిషనరీ సొసైటీ (సీఎంఎస్) ఏర్పడింది.
తర్వాత 1892లో మిషన్ ఆసుపత్రి, పాఠశాల, బోర్డింగ్ హోం ప్రారంభమైంది. చర్చి మిషనరీ సొసైటీకి జేబీ పెయిన్స్ అనే వ్యక్తి మతగురువుగా ఉండేవారు. అప్పట్లో క్రీస్తువిశ్వాసకులు పూరిపాకల్లో ప్రార్థన చేసేవారు. ఇది గమనించిన పెయిన్స్ ఖమ్మంలో చర్చి నిర్మించాలని అప్పటికే పట్టణంలో రైల్వేలైన్ పనులు జరుగుతుండడంతో రాకపోకలకు వీలు ఉంటుందని పెయిన్స్ ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణం ప్రారంభించారు. 1899 ఏప్రిల్ 12న చర్చి పనులు ప్రారంభమయ్యాయి. సరిగ్గా చర్చి రూపుదిద్దుకుని ఈ ఏడాదికి 122 ఏళ్లు పూర్తయిందన్నమాట. మతగురువు పెయిన్స్కు అమర్లపుడి దేవదానం, దోమతొటి శామ్యూల్, తలారి దేవసహాయం, జెర్రిపోతుల ఏసోబు తదితరులు అండగా నిలబడి సొసైటీని ముందుకు నడిపించారు.
‘మిషనరీ’ ఆస్పత్రి చరిత్ర ఇదీ..
18 దశాబ్దం చివరలో రోగాలు బాగా వ్యాపించాయి. వందలాది మంది చనిపోయేవారు. ఈ నేపథ్యంలో 1892లో సొసైటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో మిషన్ ఆస్పత్రి ప్రారంభమైంది. తొలిరోజుల్లో 150 బెడ్ల సౌకర్యం ఉండేది. సాధారణ ప్రజలతో పాటు బ్రిటీష్ పాలకులు సైతం ఇక్కడే వైద్యం పొందేవారని ఇప్పటికీ చెప్తుంటారు. ఆ కాలంలోనే ప్రజలకు ఉచిత వైద్యం అందేదంటే ఊహించండి. వారికి వైద్యం అందించడానికి విదేశాల నుంచి వైద్యనిపుణులు వచ్చే వారని పెద్దలు గుర్తు చేసుకుంటారు. ఆస్పత్రి పరిధిలో ఇప్పటికీ ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరాలు జరుగుతాయి. ఆస్పత్రి ప్రారంభమైన రోజుల్లోనే సెయింట్ మెరీస్ స్కూల్ ఏర్పాటైంది.
అనేక సేవా కార్యక్రమాలూ..
నగరంలోని ప్రస్తుత చర్చి కాంపౌండ్ పేరు సీఎస్ఐ చర్చి ద్వారానే వచ్చింది. చర్చి ఆధ్వర్యంలో ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరాలు జరుగుతాయి. వైద్యనిపుణులు శస్త్ర చికిత్సలూ చేస్తారు. వ్యాధి బాధితుల నుంచి రోజువారీ ఫీజు కేవలం రూ.50 ఫీజు తీసుకుని వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం చర్చి పరిధిలో 80 మంది విద్యార్థినులతో నర్సింగ్ స్కూల్, ఒక వృద్ధాశ్రమం, రెండు బాలుర హాస్టల్స్, ఒక బాలికల హాస్టల్, ఒక పోలియో హోం అందుబాటులో ఉన్నాయి. ఇవీకాక మానసిక దివ్యాంగులకు సేవలు అందుతున్నాయి.
రాష్ట్రంలో రెండో పురాతన చర్చి
రాష్ట్రంలో మెదక్ చర్చి అతిపురాతనమైనది. ఆ తర్వాత ఖమ్మం నగరంలోని సీఎస్ఐ చర్చి పురాతమైనది. 1912లో జరిగిన డోర్నకల్ డయాసిస్కు తొలి బిషప్ అజరయ్య పట్టాభిషేకం ఈ చర్చిలోనే 1912లో జరగడం విశేషం. దేశంలోని క్రైస్తవ మిషనరీలన్నింటికీ ఇక్కడి వ్యక్తి బిషప్ కావడం విశేషం. అప్పట్లో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. విదేశీయుల పెత్తనం తమపై ఎందుకని ప్రశ్నించిన అజరయ్య ఆనాడు క్రైస్తవ సంస్థల్లో విప్లవకారుడిగా పేర్గాంచారు.