‘మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు రావాలి.. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలి.. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి’ అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘క్లస్టర్’ విధానాన్ని అమలు చేస్తున్నది.. క్లస్టర్కు ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు ఎంపికయ్యాయి. ఈ కేంద్రాలు విజ్ఞాన వికేంద్రీకరణ కళాశాలలుగా ఇతర కాలేజీలకు అనుసంధానంగా పని చేయనున్నాయి. ఉత్తమ ఫలితాల సాధనకు ఉమ్మడిగా కృషి చేయనున్నాయి.
ఖమ్మం, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నానాటికీ సాంకేతికత తన పరిధులను విస్తరించుకుంటున్నది. టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచమే ఒక కుగ్రామం. కొత్త కొత్త పరిశ్రమలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో విద్యార్థుల్లో ప్రతిభ, నైపుణ్యాలు ఉంటే విద్యా ఉపాధి అవకాశాలకు కొదువేలేదు. ముఖ్యంగా డిగ్రీ చదువు ప్రతిఒక్కరి జీవితంలో ఓ మలుపు. ఈ మూడు సంవత్సరాలు విద్యార్థులు శాస్త్రీయ విధానంలో చదువుకుంటే, నైపుణ్యాలను పెంచుకుంటే బంగారు భవిష్యత్కు బాటలు పడినట్లే. అలాంటి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ‘క్లస్టర్’ విధానాన్ని అమలు చేస్తున్నది. ఇప్పటికే డిగ్రీ వ్యవస్థలో సెమిస్టర్ విధానంలో విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. పరిశోధనలపై దృష్టి సారించేందుకు ‘జిజ్ఞాస’ వంటి విద్యార్థి కేంద్రక విద్యావిధానం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్నది. మరోవైపు క్లస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 10 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా వీటిలో 75శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే. క్లస్టర్ విద్యా విధానంలో నగర, పట్టణ, గ్రామీణ అంతరాల్ని తొలగించేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచనున్నారు.
భౌగోళిక, సాంకేతిక అంశాల నేపథ్యంలో..
ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని విద్యార్థులు తట్టుకునే విధంగా, విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు వీలుగా, భావ వ్యక్తీకరణ , కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు వీలుగా క్లస్టర్ విధానం రూపొందింది. మెరికల్లాంటి విద్యార్థుల్ని తయారు చేసి వారి కలలు, ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రణాళికలు అమలవుతాయి. ఈ విధానంతో విజ్ఞాన వికేంద్రీకరణకు అడుగులు పడతాయని విద్యారంగ నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో మౌలిక వసతులు, సాంకేతిక పద్ధతులు, బోధన సిబ్బంది, భౌగోళిక, సాంకేతికతతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని విద్యాశాఖ ‘క్లస్టర్ కళాశాల’ను గుర్తిస్తుంది. ఆ కళాశాలకు అనుసంధానంగా మిగతా పట్టణా లు, మండల కేంద్రాల్లోని డిగ్రీ కళాశాలలు పనిచేస్తాయి. విద్యార్థులనువిద్యావంతులుగా తీర్చిదిద్దుతాయి.
విస్తృత ప్రయోజనాలు…
రానున్న రోజుల్లో ఏ డిగ్రీ కళాశాలలో నూ బోధనా సిబ్బంది కొరత ఉండదు. ఎక్కడైనా అధ్యాపకులు లేని పక్షంలో ఇదే క్లస్టర్ కళాశాల నుంచి అధ్యాపకులు సదరు కళాశాలకు వెళ్లి పాఠాలు బోధిస్తారు. గ్రంథాలయం, క్రీడా మైదానాలు, సైన్స్ ల్యాబ్లు, టీఎస్కేసీ కేంద్రాలు క్లస్టర్ పరిధిలోనే ఉంటాయి. ఉమ్మడిగా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు క్లస్టర్ విధానం ఉపయోగపడుతుంది.
జిల్లావ్యాప్తంగా ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం క్లస్టర్ కేంద్రాలుగా గుర్తించింది. ఖమ్మం అటానమస్ కళాశాల పరిధిలో భధ్రాచలం, కొత్తగూడెం, మధిర, పాల్వంచ, సత్తుపల్లి ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి. మహిళా డిగ్రీ కళాశాల పరిధిలో నేలకొండపల్లి, ఇల్లెందు, గార్ల, మరిపెడ, మణుగూరు కళాశాలలు అనుసంధానమై ఉంటాయి.
క్లస్టర్ విధానం సరైనది ..
క్లస్టర్ విధానం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ఈ విధానంలో విద్యార్థులకు అకడమిక్ అంశాలతో పాటు క్రీడా, సాంస్కృతిక తదితర విషయాల్లోనూ ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుంది. పట్టణ ప్రాంత విద్యార్థులతో సమంగా నాణ్యమైన విద్య అందుతుంది. క్లస్టర్ సరైన విధానం.
– డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా,ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ క్లస్టర్ కళాశాల ప్రిన్సిపాల్
క్లస్టర్ విధానంతో మేలు..
క్లస్టర్ విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుంది. డిగ్రీ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల్లోనూ నైపుణ్యాలను పెంచేందుకు క్లస్టర్ విధానం దోహదపడుతుంది. కళాశాలలన్నింటినీ ఒక యూనిట్గా పరిగణిస్తుండడంతో శిక్షణ తరగతుల నిర్వహణ సులభమవుతుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలకు మార్గం సుగమమవుతుంది.
– డాక్టర్ పద్మావతి,మహిళా డిగ్రీ క్లస్టర్ కళాశాల ప్రిన్సిపాల్, ఖమ్మం