– రెండు లారీలను సీజ్ చేసిన అధికారులు
ఖమ్మం రూరల్, మే 02 : ఖమ్మం రూరల్ మండలంలోని కాచిరాజుగూడెంలో మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతూ డంపర్ల ద్వారా మట్టి తరలిస్తున్న రెండు డంపర్లను శనివారం డీవైఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు గ్రామ జీపిఓ వనం శ్రీనివాసరావు, రూరల్ ఏఎస్ఐ వెంకటరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని రెండు లారీలను సీజ్ చేశారు. గ్రామంలో మట్టి అక్రమ తరలింపు పూర్తిగా నిలిపివేయాలని సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు. అక్రమంగా మట్టి తోలకాలు చేపడుతున్న లారీలను ఆపే క్రమంలో లారీ యజమాని, అతడి అనుచరులు కొంతమంది డీవైఎఫ్ఐ నాయకులపై బెదిరింపులకు దిగి, దాడికి ప్రయత్నించారు. డీవైఎఫ్ఐ నాయకులు గట్టిగా ప్రతిఘటించడంతో వారు అక్కడి నుండి పరారయ్యారు.
తమ గ్రామంలో విలువైన మట్టి సంపదను తరలించేందుకు కొంతమంది వ్యాపారులు కంకణం కట్టుకున్నారని, ఎట్టి పరిస్థితుల్లో తమ గ్రామ సంపదను బయటకు తరలిస్తే ఉపేక్షించమని డీవైఎఫ్ఐ ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి పొన్నం మురళి హెచ్చరించారు. మరోసారి గ్రామంలో మట్టి తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు చాంద్ పాషా, యాకూబ్ పాషా, హరీష్, సాయి, వట్టికోట ప్రయోజ్, సీపీఎం నాయకులు పొన్నం వెంకటరమణ, పొన్నం భాస్కరరావు, యండపల్లి వీరయ్య, ఏలూరి నాగేశ్వరరావు, షేక్.సైదులు, కారుమంచి చలమయ్య, జిల్లెల వెంకయ్య పాల్గొన్నారు.