ఖమ్మం, ఏప్రిల్ 14 : మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి నోరు అదుపులో పెట్టుకోవాలని, మంత్రి పువ్వాడ అజయ్కుమార్పై అనుచితంగా మాట్లాడితే సహించబోమని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ హెచ్చరించారు. చీమలపాడు ఘటనపై శవ రాజకీయాలు తగవన్నారు. నగరంలోని వీడీవోస్ కాలనీ మంత్రి పువ్వాడ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం పలు డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కారేపల్లి మండలం చీమలపాడులో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతిచెందడం, పలువురు గాయపడడం బాధాకరమన్నారు. ఘటనపై మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు రేణుకా చౌదరి తన గతాన్ని మరచిపోవద్దన్నారు. టిక్కెట్లు ఇప్పిస్తానని కొందరిని నమ్మబలికి, వారి చావుకు కారణమైన మాజీ కేంద్ర మంత్రిని ప్రజలు ఇంకా మరువలేదన్నారు.
జిల్లా నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేసి జిల్లాప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ఆమె ప్రమేయంతో గతంలో డీసీఎంఎస్ పరిధిలో రూ.7 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఖమ్మం ఏఎంసీ చైర్మన్, కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత మాట్లాడుతూ.. మాజీ కేంద్ర రేణుకా చౌదరికి మతిభ్రమించిందన్నారు. ఏదైనా ఆస్పత్రిలో చికిత్స పొందాలన్నారు. కార్పొరేటర్లు పల్లా రోజ్లీనా, నీరజ, ప్రశాంత లక్ష్మి మాట్లాడుతూ.. ఖమ్మం నగరం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. నగరాభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మాజీ కేంద్ర మంత్రికి లేదన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు మందడపు లక్ష్మి, దాదె అమృతమ్మ, సరిపూడి రమాదేవి, తోట ఉమారాణి, చిరుమామిళ్ల లక్ష్మి, మోతారపు శ్రావణి, పైడిపల్లి రోహిణి, ధనాల రాధ, గోళ్ల చంద్రకళ, ఆళ్ల నిరీషా, కమల, నాయకులు తన్నీరు శోభారాణి, షకీనా పాల్గొన్నారు.
మావోయిస్టు దళ సభ్యుడి లొంగుబాటు
కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 14: తెలిసీ తెలియని వయసులో అడవి బాట పట్టాడు.. ఆయుధం పట్టాడు.. మావోయిస్టులు అక్కడ పాల్పడుతున్న అకృత్యాలను కళ్లారా చూశాడు.. ఏజెన్సీలో పోలీసులు చేస్తున్న చైతన్య కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. సీఆర్పీఎఫ్ అధికారులు, పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న వివరాలు వెల్లడించారు. చర్ల మండలం చెన్నాపురానికి చెందిన సోడి రామ (17) 2020లో మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా చేరాడు. 2022లో పార్టీలో సభ్యుడిగా, తర్వాత డీకేఏఎస్సార్ డివిజన్ కార్యదర్శి ఆజాద్ వద్ద గన్మెన్గా ఎదిగాడు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం – తూర్పు గోదావరి డివిజన్ దళంలో సభ్యుడయ్యాడు.
దండకారణ్యంలో మావోయిస్టులు మైనర్లను బెదిరించి పార్టీలో సభ్యులుగా చేర్చుకోవడాన్ని చూసి ఏవగింపు తెచ్చుకున్నాడు. వారితో బలవంతంగా బట్టలు ఉతికించుకోవడం, సామగ్రి మోయించడం, వంట పని చేయించడాన్ని చూసి చలించిపోయాడు. ఈక్రమంలో భద్రాద్రి జిల్లా పోలీసులు ‘ఆపరేషన్ చేయూత’లో భాగంగా రామ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కుమారుడు జన జీవన స్రవంతిలోకి రావాలని తల్లిదండ్రులు కోరుకున్నారు. దీంతో అప్పటికే మావోయిస్టుల తీరుపై విరక్తి చెంది ఉన్న రామ సీఆర్పీఎఫ్ 81, 141 బెటాలియన్ అధికారుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయాడని ఎస్పీ తెలిపారు. అనంతరం బాలుడికి ప్రభుత్వం అందించే నగదు ప్రోత్సాహక చెక్కు అందించారు. సమావేశంలో ఓఎస్డీ టి.సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోశ్, సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ధర్, 81వ బెటాలియన్ అదనపు కమాండెంట్ పియూష్ తివారి, చర్ల సీఐ బొడ్డు అశోక్ కుమార్, ఎస్సై సూరి, పీఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.