ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 25 : ఇటీవలే పీజీ పూర్తి చేసిన రామ్.. ఎంతో ఉత్సాహంతో మంచి ఉద్యోగం కోసం నగరంలోని ఓ వ్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లాడు. టిక్టాక్గా రెడీ అయి మంచిగా టక్ వేసుకొని నీట్గా టై కట్టుకొని స్మార్ట్ బాయ్లా ఉత్సాహంగా వెళ్లాడు. రిసెప్షనిస్ట్ అతడి పేరును పిలిచి లోపలికి పంపే వరకూ చేతిలో ఫైలును ఊపుతూ, మాంచి ఎైగ్జెటింగ్ను ప్రదర్శిస్తూ కన్పించాడు. ఇంతలో అతడి వంతు రానే వచ్చింది. రిసెప్షనిస్ట్ పిలవనే పిలిచింది. మాంచి ఊపుగా, ఉత్సాహంగా చాంబర్లోకి వెళ్లిన రామ్ను ఇంటర్వ్యూయర్ విష్ చేశాడు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని చెప్పడంతో రామ్ హుందాను ప్రదర్శిస్తూ సీట్లో కూర్చున్నాడు. అంతకుముందే అతడు పంపిన రెజ్యూమ్ను పరిశీలించిన.. ఇంటర్వ్యూయర్ సర్టిఫికెట్ల ఫైల్ ఏదంటూ అడిగారు. ఠకీమని ఫైల్ తీసి చేతికిచ్చాడు రామ్. ఆ ఫైల్ను, అతడి రెజ్యూమ్ను టేబుల్పైన పక్కకు పెట్టిన ఇంటర్వ్యూయర్.. తడుము కోకుండా, మొబైల్ చూడకుండా అతడి బంధువులు, స్నేహితుల్లోని ఓ ఐదుగురి ఫోన్ నెంబర్లు చెప్పమని అడిగాడు. ఊహించని ఆ ప్రశ్నకు తన నెంబర్ తప్ప మరెవ్వరి నెంబరూ చెప్పలేకపోయాడు ‘స్మార్ట్’ రామ్. తానెలాగూ సెలెక్ట్ కానన్న నిరుత్సాహంతో ఉసూరుమంటూ ఆ కంపెనీ మెట్లు దిగాడు రాక్లా ఉండే రామ్.
ఇది ఈ ఒక్క రామ్ పరిస్థితి మాత్రమే కాదు..
ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ఆసాంతం పెరుగుతుండడంతో మనిషి తన సహజ సిద్ధమైన, అనంతమైన జ్ఞాపకశక్తిని అంతే వేగంగా కోల్పోతున్నాడు. అపరిమితంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి తన మెదడుకు పదును పెట్టడాన్ని మానేస్తున్నాడు. దాని స్థానంలో టెక్నాలజీపై ఆధారపడుతున్నాడు. ఫలితంగా మెదడు మొద్దుబారిపోతోంది. మనిషి తన మెదడుకు పని చెప్పకుండా యాంత్రిక జీవనంలో ప్రతి విషయానికీ టెక్నాలజీపై ఆధారపడుతుండడంతో సహజంగానే తనకు తానుగా తన మస్తిష్కం మసకబారేలా చేసుకుంటున్నాడని సైకాలజిస్టులు చెబుతున్నారు. నిత్యం వర్తకంలో తలమునకలయ్యే వ్యాపారులు తప్ప చాలా మంది క్యాలిక్యులేటర్పైనే ఆధారపడుతున్నారని, చాలామంది యువకులు కూడా ‘గజినీ’ల్లా ప్రతి ఐదు నిమిషాలకూ జ్ఞాపకశక్తిని కోల్పోయేలా తాయరవుతున్నారని మనోవైజ్ఞానిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి చిన్న పిల్లల్లో మరింతగా ఉంటే మున్ముందు వారిలో విజ్ఞానం కూడా కుచించుకపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
పాఠశాలలకు వెళ్లే పిల్లల జ్ఞాపకశక్తి ఎలా ఉందో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఒకవేళ జ్ఞాపకశక్తి అంతంత మాత్రంగా ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే వయసు పెరిగేకొద్దీ అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే, పిల్లలు తీసుకునే ఆహారం వారి ఆరోగ్యానికే కాకుండా మెదడుకు కూడా మేలు చేసేలా ఉండాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులు అధికంగా ఉండే పదార్థాలు క్రమం తప్పకుండా అందించాలని సూచిస్తున్నారు. తద్వారా ప్రొటీన్లు, క్యాల్షియం, పొటాషియం తదితర విటమిన్లు సమృద్ధిగా లభించే అవకాశం ఉంది. నేరేడు పండ్లను వాటి సీజన్లో సేకరించి పిల్లలకు తినిపిస్తే వారిలో జ్ఞాపకశక్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి రోజూ ఉడకబెట్టిన కోడిగుడ్డు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్లను, టమాట, క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలను, ఇతర ఆకుకూరలను పిల్లలకు అందిస్తే వారిలో సులభంగానే జ్ఞాపకశక్తి పెంపొందుతుందని
న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.
మనం చదివే విషయమైనా, చూసే దృశ్యమైనా, వినే అంశమైనా మెదడులోని స్మృతి పీటికల్లో నిక్షేపంగా ఉంటుంది. ముందు తరాల వారంతా స్వతహాగా ఆలోచనాపరులు, మెదడును ఉపయోగించి సమాచారం గ్రహించడమో, నిక్షిప్తం చేసుకోవడమో చేసేవారు. మెదడులోని స్మృతి పీటికల్లో కొంత అసంఖ్యాకమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. ఇది కంప్యూటర్లో వినియోగించే మెమొరీ కార్డుల కంటే ఎన్నో రేట్లు అధికం. కానీ.. మనం పని కల్పించని కారణంగా ఇప్పుడది క్రమంగా మొద్దుబారిపోతోంది. మనిషి మెదడులోని పదిశాతం సామర్థ్యాన్ని వినియోగించుకున్నా.. కంప్యూటర్ కన్నా వేగంగా పని చేయగలమని, అద్భుతాలు సృష్టించగలమని నిపుణులు చెబుతున్నారు. కానీ.. నేటి మనుషులు స్మృతి పీటికలను మూడుశాతం కూడా వినియోగించడం లేదని పరిశోధనల్లో స్పష్టమవుతోందని చెబుతున్నారు.
నేటి మనుషుల్లో మానసిక వేదన ఎక్కువవుతోంది. విరామం లేని పనులతో తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. ప్రతి చిన్న పనికీ సెల్ఫోన్లు, క్యాలిక్యూలేటర్లు, కంప్యూటర్లపై ఆధారపడుతున్నారు. ఫలితంగా మెదడుకు సరైన పనిలేక జ్ఞాపకశక్తి నశిస్తోంది. నేటి విద్యా విధానం కూడా ఇలాంటి పరిస్థితికి మరో రకంగా కారణమవుతోంది. ఆధునిక విద్యావిధానం పేరుతో నేటి చిన్నారుల చదువులకు కూడా కంప్యూటర్ శిక్షణ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎల్కేజీ పిల్లవాడిని కంప్యూటర్ ముందు కూర్చొబెట్టి నేర్పుతుండడంతో పిల్లల్లో సహజ సిద్ధమైన తెలివితేటలు నశిస్తున్నాయి. విరామం లేకుండా గంటల తరబడి పనిచేయడం, రాత్రంతా పనిచేస్తూ పగటి పూట నిద్రపోవడం, మద్యం, సిగరెట్టు, గుట్కా వంటి అలవాట్లు, టీవీ ఎక్కువగా చూడడం వంటి చర్యలన్నీ మెదడుపై దుష్పరిణామాలు చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికైనా కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు.
టెక్నాలజీపైనే పూర్తిగా ఆధారపడడం, దానికి అతిగా అలవాటు పడడం అనర్థాలకు దారితీస్తుంది. ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం. అయితే సహజత్వం పూర్తిగా కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కరిలో షార్ట్టైం మెమొరీ, లాంగ్టైం మెమొరీ అనేవి ఉంటాయి. నిత్యం సెల్ఫోన్లు, కంప్యూటర్లు, క్యాలిక్యులేటర్ల వంటి సాధనాలపై ఆధారపడితే కొంతకాలం తరువాత మనం స్వతహాగా ఆలోచించే విధానాన్ని మర్చిపోతాం. అది ఎంతో ప్రమాదకరం. ముఖ్యంగా చిన్న వయసు నుంచే సాధ్యమైనంతగా శారీరక శ్రమతో కూడిన ఆటలను తప్పకుండా ఆడాలి. అదే విధంగా చిన్నపాటి లెక్కలను మెమొరీ సాయంతో చేసే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. నిత్యం సాంకేతిక పరిజ్ఞానంతోనే గడిపితే నరాల సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముంది. -డాక్టర్ కేసగాని రాజశేఖర్గౌడ్, ఎండీ, జనరల్ మెడిసిన్, ఖమ్మం