మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోలాహలం ముగిసింది.. బుధవారం పోలింగ్ ప్రక్రియ పూర్తయింది.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. క్రికెట్ ట్రోఫీల్లాగానే ఇప్పుడు జూదరుల దృష్టి ఉప ఎన్నిక ఫలితాలపై పడింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి అనుకూలంగా రావడం, ప్రజల మద్దతు ఆయనకే ఉందని ప్రచారం జరుగుతుండడంతో మిగిలిన రెండు, మూడు స్థానాల్లో ఎవరు నిలుస్తారనే అంశాలపై ఉమ్మడి జిల్లాలో జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్కు ఎంత మెజార్టీ వస్తుంది..? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి..? డిపాజిట్లు ఎవరెవరు కోల్పోతారు? అనే అంశాలపైనా భారీగా బెట్టింగ్ పెడుతున్నట్లు తెలిసింది.
ఖమ్మం, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లాలో పందేల జోరు హోరెత్తుతున్నది. ఎన్నికకు బుధవారం పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారని సమాచారం. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం ఖాయమనే ధీమాతో ఎక్కువ మంది ఆయన గెలుస్తాడని పందెం కాస్తున్నట్లు తెలుస్తున్నది. టీఆర్ఎస్కు ఎంత మెజారీ వస్తుంది..? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి..? రెండు, మూడు స్థానాల్లో ఏ అభ్యర్థి ఉంటారు..? అని పందేలు విడివిడిగా కాస్తుండడం గమనార్హం. ఉభయ జిల్లాలే కాక ఇరు జిల్లాలను ఆనుకొని ఉన్న ఏపీలోని తిరువూరు, చాట్రాయి, నూజివీడు, నందిగామ, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లోనూ భారీగా పందేలు జరుగుతున్నాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి గెలుస్తారని అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, సత్తుపల్లిలో కొందరు పందెంరాయుళ్లు ఏకంగా రూ.లక్ష వరకు పందేలు కాసినట్లు తెలుస్తున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడని కొందరు పందెం కాస్తే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏయే స్థానాల్లో నిలుస్తారని పందేలు సాగుతున్నాయి. అంతేకాదు విచిత్ర వేషధారణలతో ఎన్నికల ప్రచారం చేసిన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్కు ఎన్ని ఓట్లు వస్తాయి? ఆయన డిపాజిట్ దక్కుతుందా? లేదా?అనే అంశాలపైనా బెట్టింగ్స్ జరుగుతుండడం విశేషం. ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ, గెలుపు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రచారంలో పాల్గొన్న నాయకుల అభిప్రాయాలనూ పరిణనలోకి తీసుకుంటున్నారు. ఒక్క టీఆర్ఎస్ అభ్యర్థికి తప్ప ఎవరికీ ప్రజల మద్దతు లేదని తెలుసుకుని అందుకు అనుగుణంగా పందేలు కాస్తున్నారు. ఈనెల 6న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అప్పుడు చూడాలి పందెంరాయుళ్ల జ్యోస్యాలు. ఎన్నికల ఫలితాలు.
గులాబీ దళం విస్తృత ప్రచారం..
మునుగోడు ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రచారానికి ఖమ్మం జిల్లా నుంచి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి, పాలేరు, వైరా శాసనసభ్యులు వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు ద్వితీయ శ్రేణి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్లు తరలివెళ్లారు. ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.