మిషన్ కాకతీయతో చెరువులు బలోపేతం కావడం, భూగర్భజలాలు పుష్కలంగా ఉండడం, చివరి ఆయకట్టు వరకు సాగర్ జలాలు పారడంతో ఉమ్మడి జిల్లాలో వరి విస్తారంగా పండింది. పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఇప్పటికే 70 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. మిగతా చోట్ల ముమ్మరంగా కోతలు సాగుతున్నాయి. ధాన్యం సేకరణకు ప్రభుత్వం గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,060, కామన్ రకానికి 2,040 చొప్పున రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నది. రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా ప్రభుత్వమే ధాన్యం కొంటున్నది. కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పౌర సరఫరాలశాఖ అధికారులు జాగ్రత్త వహిస్తున్నారు. ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్ ఎప్పటికప్పుడు ధాన్యం సేకరణను సమీక్షిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పర్యవేక్షిస్తున్నారు. పొరుగు రాష్ర్టాల నుంచి అక్రమంగా ధాన్యం తరలిరాకుండా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్, విజిలెన్స్, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు.
ఖమ్మం (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ) డిసెంబర్ 20 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 154 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే 87 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. పీఏసీఎస్ పరిధిలో 107 కేంద్రాలు, జీసీసీ 29, ఐకేపీ 11, మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో ఏడు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వానకాలంలో పండించిన 1.50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఏ గ్రేడ్ రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.2,060, కామన్ రకానికి 2,040 ధర నిర్ణయించింది. ఇప్పటికే 17,872 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రైతుల ఖాతాల్లో రూ.28.35 కోట్ల సొమ్ము జమ చేసింది.ఖమ్మం జిల్లాలో 226 కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు ధాన్యం సేకరిస్త్తున్నారు. 4- 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యపు సేకరణ లక్ష్యానికి గాను ఇప్పటివరకు రూ. 83.12 కోట్ల విలువైన 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రైతుల ఖాతాల్లో రూ.35 కోట్ల సొమ్ము జమ చేశారు. నేలకొండపల్లి, పెనుబల్లి, కల్లూరు, సత్లుపల్లి ప్రాంతాల్లో వరి కోతలు ముందుగా ప్రారంభం కావడంతో ఆయా ప్రాం తాల్లో 70 శాతం ధాన్యం సేకరణ పూర్తయింది. కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ముందు ధాన్యాన్ని ఆరబెట్టాలి. ధాన్యంలో చెత్త, తాలు, పొల్లు, పొట్టు, మట్టి లేకుండా చూడాలి. డీఏవో నేతృత్వంలో ఏవో, ఏఈవోలు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ధాన్యం క్రయవిక్రయాలకు సంబంధించిన తేదీలను ఖరారు చేస్తున్నారు. రైతుబంధు సమితి కమిటీలు, వ్యవసాయశాఖ అధికారుల సమన్వయంతో రైతులకు సలహాలు, సూచనలిస్తున్నారు.
ప్రతి రైస్ మిల్లర్ జిల్లా మేనేజర్ వద్ద తప్పనిసరిగా అగ్రిమెంట్ చేయించుకోవాలి. తప్పనిసరిగా ఫామ్ ఏ-2 రిజిష్టరు నిర్వహించాలి. దానిలో సీఎంఆర్ ధాన్యానికి సంబంధించిన వివరాలు, ధాన్యం కొనుగోలు, ధాన్యం ఆడించిన వివరాలు, సీఎంఆర్ డెలివరీ వివరాలు నమోదు చేయాలి. క్రయవిక్రయాలను రైస్ మిల్లర్ల ప్రెసిడెంట్ పర్యవేక్షించాలి. మిల్లుల వద్ద ధాన్యం పోగు కాకుండా ఎప్పటికప్పుడు దిగుమతి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. సీఎంఆర్ ధాన్యాన్ని జిల్లా మేనేజర్ కేటాయించిన గోడౌన్లలోనే దిగుమతి చేయాలి.
భద్రాద్రి జిల్లాకు సరిహద్దులో ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఆయా రాష్ర్టాల నుంచి ధాన్యం అక్రమంగా రాష్ర్టానికి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. భద్రాచలం, అశ్వారావుపేటలో చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల అధికారి, పోలీసులు, వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. సిబ్బంది ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి ధాన్యం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు.
గతంలో వడ్లు అమ్ముకోవాలంటే రవాణా ఖర్చులు తడిసి మోపెడయ్యేవి. అంతా చేసి ధా న్యం విక్రయ కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ పడిగాపులు కాయా ల్సి వచ్చేది. ప్రభుత్వం చొరవ తీసుకుని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో మాకు కష్టాలు తప్పాయి. ధాన్యం విక్రయించిన అతికొద్దిరోజుల్లోనే ఖాతాల్లో నగదు జమ అవుతున్నది. కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేదు.
– చంద్రారెడ్డి, రైతు,
హేమచంద్రాపురం, భద్రాద్రి జిల్లా
మా ఊరు పక్కనే చెరువు. ఆ చెరువు పక్కనే పంట పొలాలు. సాగునీరు పుష్కలం. వరి సాగుకు ఢోకానే లేదు. వానకాలంలో వడ్లు బాగా పండాయి. పశువులకు మేత సమకూరింది. వడ్లు అమ్ముకునేందుకు స్థానికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటైంది. దీంతో మాకు రవాణా కష్టాలు తప్పాయి. ఒకేఒక రోజులో నేను ధాన్యం విక్రయించాను.
– బోళ్ల లక్ష్మారెడ్డి, రైతు, కారుకొండ, భద్రాద్రి జిల్లా
కేంద్రం వడ్లు కొనబోమని చెప్ప డం దారుణం. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో మాకు అండగా నిలిచి ధాన్యం కొంటున్నారు. గిట్టుబాటు ధర ఇస్తున్నారు. ధరను ఏటికేడు పెంచుతున్నా రు. ఇంతకంటే మాకేం కావాలి. వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు మాకు సలహాలు ఇస్తున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు.
– రాంరెడ్డి, రైతు, హేమచంద్రాపురం, భద్రాద్రి జిల్లా
సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు పాలేరు నియోజకర్గంలోని నేలకొండపల్లి, పాలేరు రిజర్వాయర్ పరిసర ప్రాంతా ల్లో ఇప్పటికే 70శాతం కొనుగోళ్లు పూర్తి చేశాం. మిగతా మండలాల్లో వరి కోతలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ప్రక్రియను ఐకేపీ, డీసీసీబీ, వ్యవసాయ, మార్కెటింగ్, డీసీఎంఎస్శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
– ఎన్.మధుసూదన్, అదనపు కలెక్టర్, ఖమ్మం