మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు కురిసిన వర్షంతో ఉమ్మడి జిల్లా తడిసి ముద్దయింది.. మొలక దశలో ఉన్న పత్తి పంటకు వర్షం ప్రాణం పోసింది. కంది, పెసర పంటలకు ఊపిరిపోసింది. వరి నాట్లకు మార్గం సుగమం చేసింది. ఖమ్మం జిల్లాలో సగటున 24.9 మి.మీ, భద్రాద్రి జిల్లాలో సగటున 51.5 మి.మీ వర్షపాతం నమోదైంది. చర్ల మండల పరిధిలోని తాలిపేరు రిజర్వాయర్లోకి భారీగా వరద నీరుచేరింది. ప్రాజెక్ట్ అధికారులు 21 గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం రాత్రి 10 గంటల వరకు 35.20 అడుగులకు చేరింది. వైరా, కిన్నెరసాని రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. సింగరేణి ఓసీల్లోకి వరద చేరడంతో ఎక్కడికక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపో యింది. చర్ల, దుమ్ముగూడెం ముంపు ప్రాంతాల్లో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. వరద పరిస్థితుల సహాయార్థం కొత్తగూడెంలోని కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
ఖమ్మం, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ): ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం 24.9 మి.మీ నమోదు కాగా అత్యధికంగా కూసుమంచి మండలంలో 34.8 మి.మీ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సగటున 51.5 మి.మీ వర్షపాతం నమోదు కాగా దుమ్ముగూడెం మండలంలో 165 మి.మీ నమోదైంది. భారీ వర్షానికి భద్రాద్రి జిల్లా చర్ల మండల పరిధిలోని తాలిపేరు రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 74 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 71.24 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 21 గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం రాత్రి 10 గంటల వరకు 35.20 అడుగులకు చేరింది. అలాగే వానల ధాటికి సింగరేణి ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు ఏరియా పరిధిలోని ఓపెన్కాస్ట్ల్లోకి వరద చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. అధికారులు భారీ మోటర్లు పెట్టి వరద నీటిని బయటకు తోడిస్తున్నారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి, కిష్టారం ఓసీల పరిధిలో 38 వేల టన్నులు, ఇదే ఏరియాలోని ఇతర ఓసీల్లో 30 వేల టన్నులు, మణుగూరులో ఏరియాలోని ఓసీల పరిధిలో 18 వేల టన్నులు, ఇల్లెందు ఏరియా పరిధిలోని ఓసీలో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
ఖమ్మం జిల్లా పరిధిలోని వైరా రిజర్వాయర్ భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 14.9 అడుగులకు చేరుకున్నది. నిన్నమొన్నటి వరకు వానలు లేక వెనుకబడిన సాగు ఇక నుంచి ఉభయ జిల్లాల్లో ఊపందుకోనున్నది. ఇప్పటికే మొలక దశలో ఉన్న పత్తి పంటకు వర్షం ప్రాణం పోసినట్లయింది. అలాగే పెసర, కంది, పెసర పంటలూ ఊపిరిపోసుకోనున్నాయి. వరి నారు పోసిన రైతులు ఇక నాట్లు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో రైతులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గంలో కలెక్టర్ ప్రియాంక ఆల పర్యటించారు. స్వయంగా గ్రామాల్లో పర్యటించారు. గోదావరి ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కలెక్టర్ వరద పరిస్థితుల సహాయార్థం కొత్తగూడెంలోని కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.