ఖమ్మం, సెప్టెంబర్ 15: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఈ గృహలక్ష్మి పథకం అదనమని అన్నారు. నగరంలోని 2, 3, 4, 8, 26 డివిజన్లు, రఘునాథపాలెం మండలం బూడిదంపాడు, ఈర్లపూడి గ్రామాల లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలను ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం పంపిణీ చేసి మాట్లాడారు.
సొంత స్థలం ఉన్న వారు తమ జాగాలో సొంత ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.12 వేల కోట్లు వెచ్చించి మొత్తం రాష్ట్రంలో 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిందని అన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికీ 3 వేల ఇళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. అయితే ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 4 వేల ఇళ్లకు దరఖాస్తులు రాగా ఇప్పుడు రెండు వేల ఇళ్లకు మంజూరు పత్రాలు అందిస్తున్నామని, రెండో విడతలో మిగిలిన ఇళ్లను కూడా అందిస్తామని తెలిపారు.
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని మంత్రి అజయ్ స్పష్టం చేశారు. ఖమ్మంలో గెలిచేది కూడా తానేనని అన్నారు. గృహలక్ష్మి పథకం మంజూరైన లబ్ధిదారులకు మంత్రి అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాకు 15,500 గృహాలక్ష్మి ఇళ్లు మంజూరైనట్లు చెప్పారు. మంజూరు పత్రాలు పొందిన వారు త్వరలోనే మంచిరోజు చూసుకొని పనులు ప్రారంభించుకోవాలని సూచించారు. బేస్మెంట్ వరకు రూ.లక్ష, రూఫ్ లెవల్ వరకు వస్తే రూ.మరో లక్ష, నిర్మాణం పూర్తయితే ఇంకో రూ.లక్ష చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కొండబాల కోటేశ్వరరావు, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, సత్యప్రసాద్, ఆదర్శ్ సురభి, గణేశ్, స్వామి, గౌరీ, ప్రియాంక, మల్లీశ్వరి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.