సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 30 : సత్తుపల్లి నియోజకవర్గం తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ సహకారంతోనే ఇది సాధ్యమైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం సత్తుపల్లికి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. కేసీఆర్ సహకారంతోనే సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని, తెలంగాణ వచ్చాక నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందింది, రాకముందు ఎలా ఉండేది ప్రతిఒక్కరూ గమనించాలని అన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మట్టిలేని రోడ్డు ఉందంటే అది కేసీఆర్ గొప్పతనమేనన్నారు. మరోపక్క మంత్రి కేటీఆర్ చొరవతో తొమ్మిదేండ్లలో సత్తుపల్లి నియోజకవర్గంలో రూ.1000 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని కొనియాడారు. సత్తుపల్లి పట్టణాభివృద్ధి కోసం కేటీఆర్ ప్రత్యేకించి రూ.5 కోట్లు నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. సత్తుపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కడం గొప్ప వరమన్నారు.
భారీగా పెరిగిన భూగర్భజలాలు
రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రాంతం ఇంతలా అభివృద్ధి చెందుతుందని ఊహించలేదన్నారు. తన సొంత మండలం వేంసూరు అప్పుడు కరువు మండలంగా ఉండేదని, నేడు భూగర్భ జలాలు బాగా పెరిగాయన్నారు. 108కి ఫోన్చేస్తే ఆలస్యంగానైనా వస్తుందేమో కానీ సమస్యపై ఎమ్మెల్యే సండ్రకు ఫోన్చేస్తే వెంటనే స్పందించే నేత అని కొనియాడారు.
దేశంలో ఏకైక రైతు నాయకుడు కేసీఆర్
దేశంలోనే ఏకైక రైతు నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, పార్లమెంట్లో రైతులపక్షాన పోరాడాలని నాకు సీఎం కేసీఆర్ పదేపదే చెప్పేవారన్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేసి అనేక ఐటీ కంపెనీలు పెట్టించిన నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ బీఆర్ఎస్ను ఆశీర్వదించి తెలంగాణ అభివృద్ధికి మరింత పాటుపడాలని కోరారు.