ఖమ్మం, సెప్టెంబర్ 28: సీఎం కేసీఆర్ మానసపుత్రిక గృహలక్ష్మి పథకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించే కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. నిలువ నీడ లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. నగరంలోని 17, 18, 24, 42, 43, 46, 49, 50, 52, 53, 55, 56 డివిజన్లలో గృహలక్ష్మి పథకానికి ఎంపికైన 223 మంది లబ్ధిదారులకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రొసీడింగ్స్ను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.
గృహలక్ష్మి పథకం కింద సొంత స్థలం కలిగి ఉండి ఇళ్లు నిర్మించుకునేందుకు ఖమ్మం జిల్లాలో 15,500 అవకాశం ఉందని అన్నారు. నియోజకవర్గానికి 3 వేల మందిని ఎంపిక చేసినప్పటికీ ఖమ్మంలో మరో వెయ్యి మందికి అదనంగా లబ్ధిచేకూరనుందని అన్నారు. మూడు విడతలుగా మొత్తం రూ.3 లక్షలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని వివరించారు. కొండబాల కోటేశ్వరరావు, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, ఆదర్శ్ సురభి, మల్లీశ్వరి, రాపర్తి శరత్, బుర్రి వెంకట్కుమార్, పగడాల శ్రీవిద్య నాగరాజు, మోతారపు శ్రావణి, పైడిపల్లి రోహిణీ సత్యనారాయణ, ధనాల రాధ, మందడపు లక్ష్మీ మనోహర్, కమర్తపు మురళి, పాకాలపాటి విజయనిర్మల శేషగిరిరావు, కన్నం వైష్ణవి ప్రసన్నకృష్ణ, జ్యోతిరెడ్డి, మక్బూల్ పాల్గొన్నారు.
కాంగ్రెస్వి ఆచరణ సాధ్యం కాని హామీలు మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం, సెఫ్టెంబర్ 28: గ్యారెంటీ కార్డులంటూ కాంగ్రెస్ ఇస్తున్నవన్నీ ఆచరణ సాధ్యం కాని హామీలేనిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు రెట్టింపు ఫలాలు ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు మాయమాటలు చెబుతున్నారని అన్నారు. అలా అయితే ముందు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి గ్యారెంటీ హామీలను అమలు చేసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు అధ్వర్యంలో ఖమ్మం 18వ డివిజన్ ముస్తాఫానగర్లో గురువారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళంనలో మంత్రి మాట్లాడారు. ఖమ్మం ప్రజలంతా తన కుటుంబ సభ్యులేనన్న భావనతోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తన ప్రజలకు ఏదైనా చేయాలన్న తపనతోనే వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగానే చాలామంది వస్తుంటారని, స్వార్థంతో కూడిన ప్రేమను చూపిస్తుంటారని అన్నారు.
అదే సమయంలో వారి కపట ప్రేమను గమనించాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కొవిడ్ సమయంలో రైస్ మిల్లులు విషయంలో బొమ్మా రాజేశ్వరరావు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేకుండా అనేక చర్యలు తీసుకున్నానని వివరించారు. ఇప్పుడొస్తున్న నాయకులంతా కరోనా సమయంలో ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఎక్కడికెళ్లారని విమర్శించారు. కొండబాల కోటేశ్వరరావు, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, చిన్ని కృష్ణారావు, కమర్తపు మురళి, మందడపు లక్ష్మి, మక్బూల్, కొప్పు నరేశ్కుమార్, మెంతుల శ్రీశైలం, బండారు శ్రీనివాసరావు, పిండిపోలు రామ్మూర్తి, మన్నెం కృష్ణ, మాధవి, సుజాతరెడ్డి పాల్గొన్నారు.
అజయ్కే ఓటేస్తా..ప్రముఖ న్యాయవాది దిలీప్ చౌదరి
తాను కాంగ్రెస్ సానుభూతిపరుడినని, అయినప్పటికీ పువ్వాడ అజయ్కే ఓటేస్తానని ప్రముఖ న్యాయవాది దిలీప్చౌదరి అన్నారు. ఖమ్మం 18వ డివిజన్లో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తమతోపాటు ఖమ్మం ప్రజలనూ ఆదరించిన వాడు, ఆదుకున్న వాడు మంత్రి అజయ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఏమీ చేయని కాంగ్రెస్ వాళ్లతో ఉండాలా? అన్నీ చేస్తున్న అజయ్తో ఉండాలా? అని తనను తాను ప్రశ్నించుకున్నానని, చివరికి అజయ్ అన్నతోనే ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నారు.