Telangana | గోదావరి తీరంలో నీటి సౌకర్యం.. అనువైన వనరులు పుష్కలంగా ఉండడంతో ఐటీసీ పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు 1979లోనే బీజం పడింది. దశాబ్దాలుగా ఎదుగుతూ ఎందరికో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. లాభార్జనే ధ్యేయం కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) నిధులతో పరిసర ప్రాంతాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నది. తాజాగా పాత ప్లాంట్ ఆవరణలోని ఖాళీ స్థలంలో రూ.2,800కోట్ల పెట్టుబడితో 8వ యూనిట్ను నెలకొల్పేందుకు.. మరింత మందికి ఉపాధి కల్పించేందుకు సంకల్పించింది. ఇందుకోసం శుక్రవారం సారపాకలో అధికారులు, సంస్థ ప్రతినిధులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.
సారపాక, జూలై 13 : సారపాకలో ఇండియన్ టుబాకో కంపెనీ(ఐటీసీ) మరో నూతన యూనిట్ను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. రూ.2,800కోట్ల పెట్టుబడితో 8వ యూనిట్ను నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం సారపాకలో ప్రజాభిప్రాయ సేకరణ శుక్రవారం చేపట్టనున్నది. భద్రాద్రి గోదావరి తీరంలో ఐటీసీ పేపర్ బోర్డు కర్మాగారాన్ని 1979లో ఏర్పాటు చేశారు. ఆ పరిశ్రమ అంచలంచెలుగా ఎదుగుతూ సాలీనా 7.50లక్షల టన్నుల వర్జిన్ పేపర్ తయారు చేసే స్థాయికి చేరింది. ప్రస్తుతం కర్మాగారంలో 1,400 మంది రెగ్యులర్, 6,500 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. పరిశ్రమలో దశలవారీగా ఏడు యూనిట్ల ద్వారా ఉత్పత్తి జరుగుతుండగా.. తాజాగా 8వ యూనిట్ను నెలకొల్పేందుకు సంస్థ అధికారులు రంగం సిద్ధం చేశారు. 8వ యూనిట్ ప్రారంభమైతే మరో 2.50లక్షల టన్నుల పేపర్ ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు మరో వెయ్యి మందికి కర్మాగారంలో ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశాలున్నాయి. ప్లాంట్ నిర్మాణం పూర్తయితే జిల్లాకు మరో మణిహారంగా నిలవనున్నది.
అంతర్జాతీయ ప్రమాణాలతో…
సారపాకలో ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారాన్ని తొలుత పూర్తిస్థాయిలో బొగ్గు ఆధారిత పరిశ్రమగా స్థాపించారు. దీంతో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండేది. ఈ క్రమంలో పరిశ్రమ నుంచి వెలువడే జలవ్యర్థాలను క్లోరినేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేసేవారు. అయినప్పటికీ కాలుష్య మలినాలను పూర్తిస్థాయిలో తొలగించడం సాధ్యపడేదికాదు. కాలక్రమేణా అంతర్జాతీయంగా క్లోరినేషన్ ప్రక్రియకు స్వస్తి చెప్పి ఫిన్లాండ్లో అభివృద్ధి చేసిన ఓజోనేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీంతో జల, వాయుకాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. భారతీయ ప్రమాణాలకు మించి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా వ్యర్థాల నిర్వహణ ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
టాప్ టెన్లో చోటు
ఐటీసీ పరిశ్రమలో 8వ యూనిట్ను స్థాపించేందుకు దశాబ్దం కిందటే ప్రణాళికలు రూపొందించారు. పరిశ్రమ ఏర్పాటుకు స్థల సేకరణ కష్టంగా మారడంతో పనులు ముందుకు సాగలేదు. చివరకు ప్లాంట్ ఆవరణలోని సిబ్బంది క్వార్టర్లను తొలగించి అక్కడే 8వ యూనిట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాథమికంగా ప్లాంట్ నిర్వహణకు రూ.2,800కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. దశలవారీగా రూ.4వేల కోట్ల వరకు పెట్టుబడి చేరనుంది. కొత్తగా నిర్మించే ప్లాంట్ ద్వారా వార్షిక ఉత్పత్తి మరో 2.50లక్షల టన్నులు పెరుగనుంది. దీంతో మొత్తం వార్షిక ఉత్పత్తి 10లక్షల టన్నులకు చేరుకోనుంది. ఇప్పటికే వర్జిన్ పేపర్ తయారీలో ఆసియాలోనే నెంబర్వన్గా ఉన్న ఈ పరిశ్రమ 8వ ప్లాంట్ ఏర్పాటుతో ప్రపంచవ్యాప్తంగా టాప్టెన్లో చోటు దక్కించుకోనున్నది.
పరిసర ప్రాంతాల అభివృద్ధే పరిశ్రమ లక్ష్యం
ఐటీసీ పరిశ్రమ నిర్వహణ వల్ల సంస్థకు వచ్చే లాభాలతోపాటు పరిసర ప్రాంతాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్) నిధులతోపాటు సంస్థకు వచ్చే లాభాలతో పరిసర ప్రాంతాల్లోని 12 గ్రామాలను దత్తత తీసుకుని ఆ ప్రాంత ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. తాగునీరు, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. అంగన్వాడీ భవనాలు, బస్షెల్టర్లు, పాఠశాలల విద్యార్థులకు నోటుపుస్తకాలు, గోదావరి వరద బాధితులకు నిత్యావసర సరుకులు, ఇతర సహాయ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నది. కోట్లాది రూపాయలు వెచ్చించి దత్తత గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నది.
నేడు ప్రజాభిప్రాయ సేకరణ
ఐటీసీ పీఎస్పీడీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 8వ ప్లాంట్ విస్తరణకు శుక్రవారం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. భూసేకరణ సమస్య లేకపోవడంతో ప్లాంట్ విస్తరణకు ఐటీసీ నుంచి త్వరితగతిన గ్రీన్ సిగ్నల్ లభించింది. అధికారులు ప్లాంట్ విస్తరణకు పూర్తి ఏర్పాట్లు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. మరోవైపు ఐటీసీ ప్లాంట్ నుంచి నిర్దేశిత ప్రమాణాలకు మించి వాయు, జలకాలుష్యం వెలువడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పరిసర ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు ఒకింత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా.. ప్రజల నుంచి ఏ విధమైన అభిప్రాయం వ్యక్తమవుతుందనేది వేచిచూడాల్సిందే.