ఖమ్మం, ఫిబ్రవరి 4: ఈ ఏడాది వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో జిల్లాలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరణ జరుగుతుంటుంది. ఈ ఏడాది వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. జిల్లాలో వానకాలం సీజన్లో 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా మొత్తం 2.80,619 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 42,101 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా వారికి రూ.573 కోట్ల 87 లక్షల 27 వేల 776ను చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు 30,344 మంది రైతులకు రూ.408 కోట్ల 76 లక్షల 63 వేల 384ను చెల్లించారు. ఇంకా 11,757 మంది రైతులకు రూ.165 కోట్ల 10 లక్షల 64 వేల 392ను చెల్లించాల్సి ఉంది. వీరందరి ఖాతాల్లో ఈ వారంలోపు నగదు జమ కానుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ వానకాలం సీజన్లో జిల్లాలో 3 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే లక్ష్యంగా పౌర సరఫరాల అధికారులు 234 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 4, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 29, డీఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో 53, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 148 కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రైతు ఖాతాల్లోకి ధాన్యం నగదు..
రైతులకు మద్దతు ధర చెల్లించి వారి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 చొప్పున మద్దతు ధరను కల్పిస్తూ పౌర సరఫరాల శాఖ అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన 53 కొనుగోలు కేంద్రాల ద్వారా 8,839 మంది రైతుల నుంచి గ్రేడ్-ఏ ధాన్యం 15,821 మెట్రిక్ టన్నులను, సాధారణ రకం 40,962 మెట్రిక్ టన్నులను కలిపి మొత్తం 56,783 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు.. ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 148 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటి ఆధ్వర్యంలో గ్రేడ్-ఏ రకం 36,524 మెట్రిక్ టన్నులు, సాధారణ రకం 1,53,935 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 1,90,458 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటి ఆధ్వర్యంలో గ్రేడ్-ఏ రకం 132 మెట్రిక్ టన్నులు, సాధారణ రకం 1984 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 2,116 కొనుగోళ్లు చేశారు. కాగా, మిగిలిన రైతుల ఖాతాల్లో ఈ వారంలోపు డబ్బులు జమ అవుతాయని పౌరసరఫరాల సంస్థ అసిస్టెంట్ మేనేజర్ నర్సింహారావు తెలిపారు.
రైతును రాజు చేసే లక్ష్యంగా..
జిల్లా పౌర సరఫరాల అధికారుల ముందస్తు చర్యల కారణంగా జిల్లాలో రైతులకు మేలు జరిగింది. రైతు పంట పండించిన దగ్గర నుంచి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి విక్రయించి తద్వారా డబ్బులు పొందే వరకు ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. గన్నీ సంచుల కొరత ఉన్నప్పటికీ అప్పటికప్పుడు ఇతర జిల్లాల నుంచి సంచులు తెప్పించి ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. తెలంగాణ ప్రభుత్వం రైతును అన్ని రకాలుగా ఆదుకునేలా పథకాలను రూపొందించి అమలు చేస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతును రాజు చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. ఒకవైపు రైతుకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.వేల కోట్లను వెచ్చించి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. మరోవైపు పంటకు అవసరమయ్యే పెట్టుబడిని అందించడంతోపాటు పండించిన పంటకు గిట్టుబాటు ధరను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేసింది.