దమ్మపేట రూరల్, సెప్టెంబర్ 6: కుటీర పరిశ్రమగా ఆయిల్పాం నాసిరకం మొక్కలను పెంచుతున్న అనధికారిక నర్సరీలు బహిర్గతమవుతున్నాయి. దమ్మపేట మండల పరిధిలోని లింగాపల్లిలో సోమవారం ఒక ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న నర్సరీలోని ఆయిల్పాం మొక్కలను అధికారులు ధ్వంసం చేసిన విషయం విదితమే. తాజాగా మంగళవారం ముష్టిబండ శివారులోని గుర్రాల కోటేశ్వరరావు రైతు తోటలో సుమారు మూడు వందల మొక్కలు పెంచుతున్నట్లు ఉద్యానవనాధికారి సందీప్, ఆయిల్పాం ఫీల్డ్ అధికారి సతీశ్ సమాచారం అందుకున్నారు. మొక్కలను పరిశీలించగా స్థానికంగా ఉన్న తోటల్లోని కిందపడి మొలిచిన మొక్కలను సేకరించి ప్లాస్టిక్ సంచుల్లో పెంచుతున్నట్లుగా గుర్తించారు. పంచాయతీ సర్పంచ్ బత్తిని తిరుపతిరావుతో పాటు గ్రామపెద్దల సమక్షంలో మొక్కలను అధికారులు ధ్వంసం చేశారు.
ఐదేళ్ల తరువాత తెలుస్తుంది
ఐఐపీఆర్ పెదవేగి శాస్త్రవేత్త డాక్టర్ ఎంవీ ప్రసాద్
అనుమతి లేని నర్సరీల నుంచి నాసిరకం మొక్కలను కొనుగోలు చేసి సాగు చేస్తే తీవ్రంగా నష్టపోతారని ఇండియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్పాం రీసెర్చ్ పెదవేగి కేంద్రం శాస్త్రవేత్త ఎంవీ ప్రసాద్ రైతులను హెచ్చరించారు. మొక్కల నాణ్యతపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. మొక్కలు నాటిన నాలుగు, ఐదు సంవత్సరాల తరువాతనే వాటి గుణాల ఆధారంగా నాణ్యతను గుర్తించవచ్చన్నారు. దిగుబడి ప్రారంభమైన తరువాత పామాయిల్ పండ్ల గెలలు బరువు తక్కువగా ఉండడం.. అధికంగా బరువు ఉండి నూనె శాతం ఉండకపోవడం.. పీచు, గింజ లేకుండా ఉండే ప్రమాదాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆ సమయంలో గుర్తించినప్పటకీ విలువైన కాలం, పెట్టుబడి వృథా అవుతాయని తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గుర్తించి అనధికారికంగా నిర్వహిస్తున్న నర్సరీల నుంచి కొనుగోలు చేసిన మొక్కలకు ప్రభుత్వం అందించే రాయితీలు సైతం కోల్పోతున్నారని ప్రసాద్ తెలిపారు.
నాణ్యమైన మొక్కల ఉత్పత్తి ఇలా…
డ్యూరా ఒక ఆడ మొక్క, ఫిసుఫిరా మగ మొక్కతో సంకరం చేసి హైబ్రీడ్ విత్తన మొలకలను ఉత్పత్తి చేస్తారు. దీనికోసం వరసగా నాలుగు సంవత్సరాలు రెండు వందల కిలోల పామాయిల్ పండ్ల గెలల దిగుబడి ఇచ్చిన చెట్లనే తల్లి చెట్లుగా గుర్తిస్తారు. వీటిలో గెలల బరువుతోపాటు ఆయిల్ దిగుబడి, గింజ, పీచు, పోతు గెలలు నిర్ణీత పరిమాణాల్లో ఉండే విధంగా ప్రయోగ శాలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పద్ధతిలో ఉత్పత్తి చేసిన మొలకెత్తిన విత్తనాల్లో మేలైన విత్తన మొలకలనే ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన కంపెనీలకు సరఫరా చేస్తారు. ఈ సంకరీకరణ ఆయిల్పాం ఇండియా లిమిటెడ్ తొడువురా, పాలోడ్, పెదేవేగి, మైసూరు శివారుల్లో మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి సరిపోకపోవడంతో టీఎస్ ఆయిల్ఫెడ్ మలేషియా, ఇండోనేషియా, కోస్టారికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది.
కఠిన చర్యలు తీసుకుంటాం..
జిల్లా ఉద్యానవన అధికారి మరియన్న
అనధికారికంగా నిర్వహిస్తున్న ఆయిల్పాం నర్సరీలపై ఆయిల్పామ్ యాక్టు ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా ఉద్యానవన అధికారి మరియన్న తెలిపారు. పోలీసులు, తహసీల్దార్లకు ఫిర్యాదు చేయాల్సిందిగా ఉద్యానవన అధికారి సందీప్ను ఆదేశించామన్నారు. ఈ విషయంపై కలెక్టర్కు నివేదిక ఇచ్చామని పేర్కొన్నారు.