వేంసూరు, డిసెంబర్ 13 : రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని, దానిలో భాగంగానే గ్రామాల్లో ఉచిత చేప పిల్లలను అందిస్తున్నదని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం పల్లెవాడ గ్రామపంచాయతీలో లంకాసాగర్ చెరువులో ఎఫ్డీవో బుజ్జిబాబుతో కలిసి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేపపిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు అన్యాక్రాంతంతో పాటు వాటి విస్తీర్ణం కూడా తగ్గడం, చేపల చెరువులు ఒకట్రెండు ఉండేవని, నేడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యశాఖను అభివృద్ధి చేస్తూ మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా పల్లెల్లోని అన్ని చెరువులకు ఉచితంగా చేపపిల్లలను అందించడం వలన మత్స్యకారుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, ఎంఈఓ చలంచర్ల వెంకటేశ్వరరావు, సర్పంచ్ రావూరి రమాదేవి, కార్యదర్శి రామకృష్ణ, సొసైటీ బాధ్యులు గోపి, సంఘ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కొమ్మినేపల్లి మత్స్యశాఖ సహకార సంఘ అధ్యక్షుడు మేకల మల్లికార్జున్రావు అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో పండితాపురం గ్రామానికి చెందిన శీలం శ్రీను మృతి చెందాడు. మృతుడు మత్స్యశాఖ సభ్యుడు కావడంతో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.5 లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు చల్లా నరసింహారావు, డైరెక్టర్లు బానోత్ నరసింహానాయక్, తురక భిక్షం, బండి బేగయ్య, చల్ల పెద్దనాగయ్య తదితరులు పాల్గొన్నారు.