భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22 (నమస్తే తెలంగాణ): అమరుల త్యాగం అజరామరమైనదని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ఉద్యమకారుల ఆశయం.. కేసీఆర్ పాలనలోనే సాకారమైందని స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో తీర్చిదిద్దిన మహనీయుడు కేసీఆర్ అని ప్రశంసించారు. దశాబ్ది వేడుకల ముగింపు సందర్భంగా భద్రాద్రి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్తో కలిసి కొత్తగూడెం ప్రగతి మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు.
అనంతరం ఐడీవోసీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మాట్లాడారు. ఎందరో అమరుల త్యాగ ఫలంగా సిద్ధించిన తెలంగాణ అభివృద్ధికి అందరమూ కలిసి బీజాలు వేసుకుందామని అన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. అలాగే స్వరాష్ట్ర కల సాకారమయ్యాక తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవయ్యాయని అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వల్లనే బంగారు తెలంగాణ సాధ్యమైందని అన్నారు. నాడు బోసిపోయిన పల్లెలు నేడు పల్లెప్రగతితో కళకళలాడుతున్నాయని గుర్తుచేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ పుణ్యమేనని అన్నారు.
కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ అమరుల త్యాగానికి గుర్తుగా నాడు ఉద్యమంలో పాల్గొన్న వారిని సన్మానించుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు కళారూపాల ప్రదర్శించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కంచర్ల చంద్రశేఖరరావు, కాపు సీతాలక్ష్మి, అశోక్చక్రవర్తి, గన్యానాయక్, విద్యాలత, సులోచనారాణి, విజేత, సబిత తదితరులు పాల్గొన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కళాకారులను అతిథులు సన్మానించారు.