అశ్వాపురం, జనవరి 28: అశ్వాపురం ప్రతిష్ఠాత్మక పథకాలకే కేంద్రబిందువుగా నిలిచింది. ఈ మండలంలో మరో కలికితురాయి చేరుతోంది. దీంతో అన్నదాతల దశ మారనున్నది. బీజీ కొత్తూరు మారెళ్లపాడు వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తాగునీరు అందించే మిషన్ భగీరథ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదే ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బీజీ కొత్తూరు 9వ మైలు నుంచి మారెళ్లపాడు వరకు చేపట్టే ఎత్తిపోతల పథకం కూడా ఇందులో చేరుతోంది. ఈ పథకం పూర్తయితే 17 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. మండలంలోని సీతారామ ఎత్తిపోతల ఇరిగేషన్ కెనాల్ నుంచి బీసీ కొత్తూరు 9వ కిలోమీటరు వద్ద పంపుహౌస్ నిర్మాణం చేపట్టనున్నారు.
మారెళ్లపాడు ఫీడర్ వరకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు విడుదల చేసే లెఫ్ట్ కెనాల్ ద్వారా జగ్గారం, తోగ్గూడెం, ఆమెర్ధ, చింతిర్యాల గ్రామాల్లో ఉన్న అన్ని చెరువులు, కుంటలకు సాగునీరు అందిస్తారు. రైట్ కెనాల్ ద్వారా మారెళ్లపాడు నుంచి తుమ్మలచెరువు వరకు గ్రావిటీ కెనాల్ ద్వారా రెండు పంటలకూ సాగునీరు అందిస్తారు. రూ.300 కోట్ల అంచనాతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. అయితే సీఎం కేసీఆర్ ఈ పథకానికి మొదటి విడతగా ఇప్పటికే రూ.25 కోట్లు నిధులు మంజూరు చేశారు. దీంతో ఆదివారం ఈ ఎత్తిపోతల పథకానికి తొలి అడుగు పడనున్నది. ఏడాది లోపే పనులు పూర్తిచేయించి తుమ్మల చెరువు ఆయకట్టుకు నీరు అందించనున్నారు. దీని కింద 5 వేల ఎకరాలను సస్యశ్యామలం చేయనున్నారు.
ఏడాదిలోపే పూర్తి చేయిస్తాం..
అన్నదాతల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం. ఇందుకోసమే ప్రభుత్వం అనేక సాగునీరు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా బీజీ కొత్తూరు నుంచి మారెళ్లపాడు వరకు రూ.300 కోట్ల అంచనాతో రూపొందించిన మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే మొదటి విడతగా రూ.25 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఎత్తిపోతలను ఏడాదిలోపే పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తాం. ఈ లిఫ్ట్ పూర్తయితే మండలంలోని 17 వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలమవుతాయి.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్
తుమ్మలచెరువుకు మహర్దశ ..
తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లని చూపుతో త్వరలో మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభం కానున్నది. దీంతో తుమ్మలచెరువుకు మహర్దశ పట్టినట్లవుతుంది. 400 ఏళ్ల నాటి కాకతీయ రాజుల పాలనలో నిర్మించిన ఈ చెరువుకు మరోసారి పూర్వవైభవం రానున్నది. ఈ చెరువు నుంచి పంట పొలాలకు వెళ్లే అన్ని కాలువలకు రూ.7 కోట్లతో కాంక్రీట్ వాల్స్ నిర్మించి గతంలోనే ఆధునీకరించారు. తాజాగా రూ.25 కోట్లతో చేపట్టిన లిఫ్ట్తో తుమ్మలచెరువు ఆయకట్టు భూములు సస్యశ్యామలం కానున్నాయి.
-మర్రి మల్లారెడ్డి, సర్పంచ్, మొండికుంట
అన్నదాతల దశ మారుతుంది..
ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం సీతారామ వంటి బృహత్తర ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీనికితోడు మండలానికి మరో కలికితురాయిని చేర్చనుంది. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం నిర్మిస్తే అశ్వాపురం మండల రైతుల దశ మారుతుంది. ఈ ఎత్తిపోతల పథకం నుంచి రెండు కాలువల ద్వారా మండలంలోని 17 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. పొలాలన్నీ సస్యశ్యామలంగా మారతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– పాటి మన్మథరెడ్డి, రైతు, మొండికుంట
పర్యాటక ప్రాంతంగానూ మారే అవకాశం..
రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్.. వారి కోసం అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా పురుడుపోసుకున్నదే మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం. ఈ పథకం ఆవశ్యకత గురించి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వివరించిన వెంటనే ఇక్కడ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. ఈ పథకం పూర్తయితే మత్స్యసంపద పెరుగుతుంది. ఈ ప్రాంత రైతుల కల్పవల్లిగా ఉన్న తుమ్మలచెరువు కూడా పర్యాటక ప్రాంతంగా విరాజిల్లనుంది.
-సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి, రైతు, ఆనందాపురం