పినపాక, మే 6: ప్రజల ఆరోగ్య రక్షణే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇందుకోసమే ప్రభుత్వం మారుమూల గ్రామాల్లోనూ పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తోందని అన్నారు. పినపాక మండలంలో శనివారం పర్యటించిన ఆయన.. ఉప్పాక గ్రామంలో రూ.14 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోనూ పల్లె దవాఖానలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడి ప్రజలకు సత్వరమే వైద్య సేవలు అందుతాయని, వారిపై ఆర్థికభారం తగ్గుతుందని అన్నారు. పల్లె దవాఖానాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ గ్రామస్తులకు మెరుగైన వైద్యసేవలందించాలని సూచించారు.
వ్యవసాయ రంగంలో వస్తున్న అధునాతన పద్ధతులను రైతులు అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆకాంక్షించారు. మండలంలోని జానంపేట రైతువేదికలో సీసీఎక్స్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం సీసీఎక్స్ సంస్థ వరిలో తడిపొడి విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, సీసీఎక్స్ ప్రతినిధులు గుమ్మడి గాంధీ, సుజాత, రామారావు, వర్మ, శ్రీనివాస్రెడ్డి, దాట్ల సుభద్రవాసుబాబు, భవానీ శంకర్, కొండేరు రాము, నాగభూషణం, బొలిశెట్టి నర్సింహారావు, కటకం గణేశ్, శ్యామల సతీశ్, డాక్టర్ దుర్గాభవాని, తాతారావు, భద్రయ్య, డాక్టర్ ఎం.నర్సింహారెడ్డి, గడ్డం వెంకటరెడ్డి, రుషికేశ్ మహదేవ్, నాసిరెడ్డి సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.