మధిర, జూన్ 28: మధిర నియోజకవర్గం చింతకానిలో ఈ నెల 30న ‘రైతు ఆశ్వీరాద సభ’ పేరుతో ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోంది. ‘పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు’ అంటూ సూక్తులు చెబుతున్న ప్రభుత్వం.. వాటిని తానే పాటించడం లేదు. మొక్కలను విరివిగా నాటాలని, వాటిని సంరక్షించాలని ఏటా ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్న ప్రభుత్వం..
సీఎం సభ కోసం ఎన్నో ఏళ్లనాడు నాటిన భారీ వృక్షాలను యంత్రాల సాయంతో క్షణాల్లో కూల్చివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద ఈ నెల 28, 29 తేదీల్లో ‘రైతు మేళా’; రైతుభరోసా నిధుల విడుదల కోసం ఈ నెల 30న ‘రైతు ఆశీర్వాద సభ’ పేరుతో పెద్ద ఎత్తున సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది.

అయితే, సభకు సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నందుకు సమీపంలోని రహదారులను, వాటి పరిసరాలను పరిశుభ్రం చేసింది. సీఎం చేరుకునేందుకు తాతాలిక రోడ్డు మార్గానికి, కాన్వాయ్ రాకపోకలకు ఆ మార్గంలో రహదారి వెంట చెట్లు అడ్డంగా ఉన్నాయంటూ వాటిని నేలమట్టం చేసింది. ఆ మార్గంలోని బాటసారులకు గత 20, 30 ఏళ్లుగా నీడనిస్తున్న పెద్ద పెద్ద చెట్లను మొదళ్లతో సహా నరికివేసింది. భారీ వృక్షాలను యంత్రాలతో కూల్చివేసింది. వాటిని ముక్కలు ముక్కలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించింది. దీంతో ఖమ్మం – బోనకల్లు రహదారిపై భారీ వృక్షాల నరికివేతపై వన ప్రేమికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
